నా భర్త ప్రాణాలకు ముప్పు

ABN , First Publish Date - 2021-05-05T09:11:10+05:30 IST

కొవిడ్‌ ఉధృతిలో అరెస్టు అయి, జైలులో ఉన్న తన భర్త ఆరోగ్యం విషయంలో ఆందోళనపడుతున్నానని, ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నదని సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ సతీమణి

నా భర్త ప్రాణాలకు ముప్పు

జైలులో జ్వరంతో బాధపడుతున్నారు

నరేంద్ర సమాచారం తెలియడం లేదు

ఫోన్లు స్విచ్ఛాప్‌ పెట్టుకొన్న అధికారులు

కరోనాలో ఏమైనా అయితే ఎవరిదీ బాధ్యత?

ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అవసరం

వెంటనే హెల్త్‌ బులెటిన్‌ ప్రకటించండి

నరేంద్ర సతీమణి జ్యోతిర్మయి అభ్యర్థన


పొన్నూరుటౌన్‌, రాజమహేంద్రవరం సిటీ, మే 4 : కొవిడ్‌ ఉధృతిలో అరెస్టు అయి, జైలులో ఉన్న తన భర్త ఆరోగ్యం విషయంలో ఆందోళనపడుతున్నానని, ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నదని సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ సతీమణి జ్యోతిర్మయి అన్నారు. తక్షణం ఆయన ఆరోగ్యస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలని కోరారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న సంగం ఎండీ గోపాలకృష్ణన్‌ కరోనా బారిన పడటంతోపాటు నరేంద్ర కూడా దగ్గు, జలుబు, స్వల్ప జ్వరం లక్షణాలతో  బాధపడుతున్నారని వచ్చిన వార్తలు నరేంద్రకుమార్‌ కుటుంబసభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో తన చిన్నకుమార్తె నాగసాయి వైదీప్తితో కలిసి మంగళవారం జ్యోతిర్మయి మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘నా భర్త ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ తెలియడం లేదు. ఏసీబీ అధికారులు, జైళ్ల శాఖ అధికారులకు ఫోన్‌ చే స్తే స్పందించడం లేదు. పైగా ఫోన్లు స్విచ్ఛాప్‌ పెట్టారు. సోమవారం రాత్రి ఎండీ గోపాలకృష్ణకరోనా బారిన పడ్డారని, ఆయన ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయని మాకు తెలిసింది. అయినా, మంగళవారం మధ్యాహ్నం వరకు ఆయనకు ఆక్సిజన్‌ అందించలేదు. ఎందుకిలా చేశారు? దీనివెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి? ఈ పరిస్థితుల్లో నా భర్తకు జైలులో సరైన వైద్యం లభించే పరిస్థితి ఉంటుందా? వారికి ఏమైనా అయితే ఎవరు బాధ్యత తీసుకొంటారు’’ అని జ్యోతిర్మయి ప్రశ్నించారు. ప్రైమరీ కాంటాక్ట్‌గా నరేంద్రకుమార్‌ ఉండటం, ఇతర ఆరోగ్య సమస్యలూ తలెత్తుతున్నందున సరైన వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా బారి నుంచి రక్షించాలని కోరారు.


నరేంద్రకు చేసినట్టు చెబుతున్న ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల వల్ల ఏమీ తేలదని తేల్చిచెప్పారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో కుట్ర దాగి ఉందని ఆరోపించారు. నరేంద్ర చిన్నకుమార్తె వైదీప్తి మాట్లాడుతూ...తమకు ఉన్న సమాచారం ప్రకారం తన తండ్రి జ్వరంతో బాధపడుతున్నారన్నారు. ‘‘వారేమీ పెద్ద పెద్దనేరాలు చేయలేదు. అక్రమ కేసులు బనాయించి వారి పై కుట్ర చేస్తున్నారు. ఆరోగ్యం బాగా లేనందున జైలు నుంచి విడుదల చేసి ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స చేయించుకొనే అవకాశం ఇవ్వాలి. ఆ తరువాత కావాలంటే తిరిగి విచారణ జరుపుకోవచ్చు. ముందుగా వారిపై ఏసీబీ అధికారులు తమ మానసిక వేధింపులను నిలిపివేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. 


నరేంద్రకు కొవిడ్‌ టెస్టు

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, సహకార శాఖ మాజీ అధికారి గురునాఽథంలకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించారు.  వారి పరీక్షల నమూనాలను కాకినాడ వైరాలజీ ల్యాబ్‌కు పంపించామని జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావు తెలిపారు. రిపోర్టులు బుధవారం వస్తాయని, ప్రస్తుతం వీరి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. 


ధూళిపాళ్లకు ప్రైవేటు వైద్యం అందించాలి

ఏసీబీ కోర్టులో న్యాయవాదుల పిటిషన్‌


విజయవాడ, మే 4 (ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రతోపాటు, డెయిరీ ఈడీ గోపాలకృష్ణకు కార్పొరేట్‌ వైద్యం అందించాలని వారి తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. గోపాలకృష్ణకు ఇప్పటికే కరోనా సోకినట్టు జైలు అధికారులు వెల్లడించారు. నరేంద్ర ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నారు. నిందితులందరినీ పోలీసులు ఒకే వ్యాన్‌లో తీసుకెళ్లారని, జైలులో ఒకేచోట ఉంచారని తమ పిటిషన్‌లో పేర్కన్నారు. 

Updated Date - 2021-05-05T09:11:10+05:30 IST