నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్
ABN , First Publish Date - 2020-04-09T10:32:34+05:30 IST
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఎనస్థీషియన్గా పనిచేస్తున్న డాక్టర్ కె.సుధాకర్ను సస్పెండ్ చేస్తూ
కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నవైద్యులు, సిబ్బందిని ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదని రెండు రోజుల క్రితం ఆరోపణలు చేసిన వైద్యుడు
విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు
నాలుగు అభియోగాలతో పోలీస్ కేసు నమోదు
నర్సీపట్నం, ఏప్రిల్ 8: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఎనస్థీషియన్గా పనిచేస్తున్న డాక్టర్ కె.సుధాకర్ను సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. కరోనా వైరస్ బారినపడిన, అనుమానిత లక్షణాలు వున్న వారికి రేయింబవళ్లు సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందికి సరిపడా పరికరాలను అందించడం లేదని, వారి ఇబ్బందులను ప్రభుత్వంపట్టించుకోవడం లేదని రెండు రోజుల క్రితం డాక్టర్ సుధాకర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ వినయచంద్ నియమించిన ముగ్గురు అధికారుల (కేజీహెచ్ సూపరింటెండెంట్, డీఆర్డీఏ పీడీ, నర్సీపట్నం ఆర్డీవో) బృందం మంగళవారం ప్రాంతీయ ఆసుపత్రిలో విచారణ నిర్వహించింది.
నివేదికను కలెక్టర్ ప్రభుత్వానికి పంపగా...డాక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారని ప్రాంతీయ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి తెలిపారు. సస్పెన్షన్ ఉత్తర్వులను డాక్టర్ సుధాకర్కు అందజేశామని ఆమె తెలిపారు. శాఖాపరంగా సుధాకర్ను సస్పెండ్ చేసినప్పటికీ ఆయనపై పోలీస్ కేసులు నమోదుకావడంతో తదుపరి విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
నాలుగు అభియోగాలతో డాక్టర్ సుధాకర్పై కేసు
నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి ఎనస్థీషియన్ డాక్టర్ కె.సుధాకర్పై పట్టణ పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. డాక్టర్ సుధాకర్ సోమవారం సాయంత్రం నర్సీపట్నం మునిసిపల్ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కించపరుస్తూ మాట్లాడారంటూ ప్రాంతీయ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.నీలవేణి ఫిర్యాదు చేశారు.
జాతీయ విపత్తు సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడం, 144 సెక్షన్ వంటి నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం, ప్రజా ప్రతిప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను వ్యక్తిగతంగా దూషించడం, తన మాటల ద్వారా ప్రజలను భయభ్రాంతులను చేయడం వంటి నేరారోపణలకు సంబంధించి డాక్టర్ సుధాకర్పై కేసు నమోదు చేశామని పట్టణ పోలీసులు తెలిపారు.