వివాహం అనంతరం.. ఇంటికి వెళ్తుండగా.. విద్యుత్ తీగ తగిలి..
ABN , First Publish Date - 2020-08-15T17:53:29+05:30 IST
మునిసిపాలిటీ పరిధి మూడో వార్డు వలంటీరు..
నర్సీపట్నం(విశాఖపట్నం): మునిసిపాలిటీ పరిధి మూడో వార్డు వలంటీరు భోజా భానుప్రకాశ్ (21) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. కాపు వీధికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి శివ, లక్ష్మి దంపతుల కుమారుడు భానుప్రకాశ్ కొంత కాలంగా వార్డు వలంటీరుగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఇంటి పక్కన జరుగుతున్న వివాహ వేడుకకు స్నేహితులతో కలిసి హాజరయ్యాడు. వివాహం అనంతరం చుట్టాలు, బంధువులు ఇళ్లకు వెళ్లే హడావుడిలో ఉండగా, జనరేటర్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ భానుప్రకాశ్కు తగలడంతో విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే స్నేహితులు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు డ్యూటీ డాక్టర్ నళినీప్రసాద్ తెలిపారు. పట్టణ సీఐ స్వామినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.