ఆ ఐదుగురికి ‘నాడా’ నోటీసులు

ABN , First Publish Date - 2020-06-14T09:04:09+05:30 IST

భారత క్రికెట్‌ జట్టుకు చెందిన ఐదుగురు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్లకు జాతీయ డోపింగ్‌ వ్యతిరేక ఏజెన్సీ (నాడా) నోటీసులు పంపింది...

ఆ ఐదుగురికి ‘నాడా’ నోటీసులు

ఆచూకీ చెప్పనందుకే.. 

జాబితాలో పుజారా, జడేజా 

బీసీసీఐ వివరణ

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టుకు చెందిన ఐదుగురు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్లకు జాతీయ డోపింగ్‌ వ్యతిరేక ఏజెన్సీ (నాడా) నోటీసులు పంపింది. లాక్‌డౌన్‌ కాలంలో ఎప్పుడు.. ఎక్కడ ఉన్నామనే విషయాన్ని వారంతా నాడాకు సమాచారం ఇవ్వనందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసులు అందుకున్న వారిలో చటేశ్వర్‌ పుజారా, రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌లతో పాటు మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, దీప్తి శర్మ ఉన్నారు. అయితే ఇలా ఎందుకు జరిగిందో బీసీసీఐ నుంచి తమకు వివరణ వచ్చిందని నాడా డీజీ నవీన్‌ అగర్వాల్‌ తెలిపాడు. ‘ఆటగాళ్లంతా తాము ఎక్కడ ఉన్నామనే విషయాన్ని యాంటీ డోపింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌/మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ (ఏడీఏఎంఎ్‌స)కు చెందిన సాఫ్ట్‌వేర్‌లో రెండు పద్దతుల ద్వారా తెలపవచ్చు. అథ్లెట్లు స్వయంగా కానీ లేదా వారికి చెందిన సమాఖ్య కానీ ఈ విషయాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. పలు క్రీడల్లోని కొంతమంది ఆటగాళ్లకు చదువు అంతగా రాకపోవడంతో పాటు ఇంటర్‌నెట్‌పై అవగాహన ఉండదు కాబట్టి ఆయా సమాఖ్యలే వారి బాధ్యత తీసుకుంటాయి. వీరితో పోలిస్తే క్రికెటర్లు విద్యావంతులే అయినా పలు కారణాలతో వారికి సమయం ఉండకపోవచ్చు. దీంతో బీసీసీఐ వారి ఆచూకీ సమాచారాన్ని నాడాతో పంచుకోవాలి. కానీ మూడు నెలలుగా ఆ ఐదుగురి గురించి మాకు తెలపలేదు. అయితే ఏడీఏఎంఎ్‌సలో వారికి సంబంధించిన పాస్‌వర్డ్స్‌తో సమస్య ఏర్పడిందని, ఇప్పుడంతా పరిష్కారమైందని బోర్డు వివరణ ఇచ్చుకుంది. వీరి సమాధానంపై మేం చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని నవీన్‌ అగర్వాల్‌ వివరించారు. ఆయా ఆటగాళ్లు ఎప్పుడు.. ఎక్కడ ఉన్నామనే సమాచారం ఇవ్వకుంటే డోపింగ్‌ నిబంధన ఉల్లంఘన కింద  గరిష్టంగా రెండేళ్ల సస్పెన్షన్‌ విధించే అవకాశం ఉంటుంది. అయితే పాస్‌వర్డ్‌తో సమస్య ఉంటే.. స్వయంగా వారినే తమ సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయాల్సిందిగా ఆ ఐదుగురిని కోరితే సరిపోయేదని బీసీసీఐకి చెందిన సీనియర్‌ అధికారి పేర్కొన్నాడు.


‘మీడియాకు దూరంగా ఉండండి’

ఇకముందు మీడియాతో మాట్లాడితే కఠిన చర్యలుంటాయని బీసీసీఐ తమ సిబ్బందిని హెచ్చరించింది. బోర్డుకు చెందిన కీలక సమాచారం లీక్‌ అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ముంబై కార్యాలయం, జాతీయ క్రికెట్‌ అకాడమీ, కార్యదర్శి జై షా ఆఫీసులో పనిచేసే స్టాఫ్‌కు ఈమెయిళ్లను పంపింది. ‘కొంతమంది మీడియాతో సన్నిహితంగా ఉంటూ ఇంటర్వ్యూలు ఇస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. కీలక సమాచారాన్ని బయటకు వెల్లడించడం ఉద్యోగుల ఒప్పందానికి వ్యతిరేకం. ఆఫీస్‌ బేరర్ల అనుమతి లేకుండా ఇక ముందు ఇలా జరిగితే క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్‌కు గురవుతారు’ అని లేఖలో స్పష్టం చేసింది.


Updated Date - 2020-06-14T09:04:09+05:30 IST