12న జాతీయ లోక్ అదాలత్
ABN , First Publish Date - 2020-12-04T05:34:11+05:30 IST
జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీఆర్కే కృపాసాగర్ తెలిపారు.
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీఆర్కే కృపాసాగర్
కర్నూలు (కల్చరల్), డిసెంబరు 3: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీఆర్కే కృపాసాగర్ తెలిపారు. గురువారం జిల్లా కోర్టులోని న్యాయ సేవాసదన్ సమావేశపు హాలులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీల న్యాయవాదులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లా కోర్టులోని మున్సిఫ్ కోర్టు ఆవరణం, అన్ని మండల న్యాయ సేవాధికార సంస్థల్లో ఈ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కరోనా నిబంధనలను అనుసరించి సుముఖంగా ఉన్న కక్షిదారులు ముందుగా తమ న్యాయవాదులను సంప్రదించి కేసు రికార్డులను లోక్ అదాలత్కు రెఫర్ చేయించుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీనివాస రావు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో సివిల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు (విడాకుల కేసులు కాకుండా), మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారం చేసుకోవచ్చన్నారు. న్యాయ స్థానాలు నిర్దేశించిన సమయాల్లో ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి కోర్టు ఆవరణలో రోజూ ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి బి. శ్యామ్సుందర్, నాలుగో అదనపు జిల్లా జడ్జి వి.శ్రీనివాస్, ఆరో అదనపు జిల్లా జడ్జి వీఎల్ఎన్ సత్యవతి, స్పెషల్ జడ్జి (ఏసీబీ కేసులు) భాస్కర్, ప్రిన్సిపల్, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.అనూరాధ, డీఆర్వో బి.పుల్లయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మోహన్బాబు, కార్యదర్శి గోపాలకృష్ణ, ఇన్సూరెన్సు కంపెనీల న్యాయవాదులు, జీపీ, ఏజీపీలు, ఇతర న్యాయవాదులు, లోక్ అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు.