అమల్లోకి వచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్
ABN , First Publish Date - 2020-09-26T07:29:27+05:30 IST
నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది...
ఎన్ఎంసీ చైర్మన్గా డాక్టర్ సురేశ్ చంద్ర శర్మ నియామకం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 64 ఏళ్ల చరిత్ర గల ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ రద్దయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్ఎంసీతో పాటు మరో నాలుగు స్వయం ప్రతిపత్తిగల మెడికల్ బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా వైద్య విద్యలో చారిత్రాత్మక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా, ఎన్ఎంసీ చైర్మన్గా ఎయిమ్స్ ఈఎన్టీ విభాగం మాజీ చీఫ్ డాక్టర్ సురేశ్ చంద్ర శర్మను ప్రభుత్వం నియమించింది. మూడేళ్లపాటు ఆయనీ పదవిలో కొనసాగుతారు. ఎంసీఐ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో జనరల్ సెక్రటరీగా పనిచేసిన రాకేష్ కుమార్ ఎన్ఎంసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం గురువారం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. కాగా, ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేసిన మరో 4 స్వయం ప్రతిపత్తి గల సంస్థలు..అండర్ గ్రా డ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్(యూజీఎంఈబీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్(పీజీఎంఈబీ), మెడికల్ అసె్సమెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డులు కూడా శుక్రవారం నుంచే ఉనికిలోకి వచ్చాయి.