అలీబాబా, యాంట్ గ్రూప్ వ్యాపారాల జాతీయకరణ ?
ABN , First Publish Date - 2021-01-13T06:18:01+05:30 IST
చైనాలో అత్యంత సంపన్నుడు, ఆలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా ఇప్పుడు ఉక్కిరిబిక్కిరివుతున్నారు. అధ్యక్షుడు జీ జిన్పింగ్ నాయకత్వంలోని చైనా ప్రభుత్వం..
జాక్ మాపై పట్టు బిగిస్తున్న చైనా ప్రభుత్వం
బీజింగ్: చైనాలో అత్యంత సంపన్నుడు, ఆలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా ఇప్పుడు ఉక్కిరిబిక్కిరివుతున్నారు. అధ్యక్షుడు జీ జిన్పింగ్ నాయకత్వంలోని చైనా ప్రభుత్వం.. జాక్ మా నిర్వహణలోని ఆలీబాబా, యాంట్ గ్రూప్ల వ్యాపారాల్ని జాతీయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబరు నుంచి చైనా ప్రభుత్వం జాక్ మాపై గుర్రుగా ఉంది. నియంత్రణ సంస్థలు చైనాలో వినూత్న వ్యాపారాలను అణిచి వేస్తున్నాయని జాక్ మా అప్పట్లో విమర్శించారు. అంతటితో ఆగకుండా చైనా బ్యాంకింగ్ రెగ్యులేటరీ సంస్థను ‘ముసలోళ్ల క్లబ్’గా అభివర్ణించారు. దీంతో అప్పటి నుంచి ఆయన అడ్రస్ లేకుండా పోయారు.
ఆయన నిర్వహణలోని ఆలీబాబా, యాంట్ గ్రూప్లపైనా చైనా నియంత్రణ సంస్థలు దర్యాప్తునకు దిగాయి. పోటీ సంస్థలు ఎదగకుందా జాక్ మా నిర్వహణలోని సంస్థలు గుత్తాధిపత్యానికి పాల్పడుతున్నాయనే ఆరోపణలతో దర్యాప్తు జరుగుతోంది కమ్యూనిస్టు పార్టీ తీర్థం పుచ్చుకున్నా జాక్ మా వ్యావపార సంస్థలపై చైనా పట్టు బిగించడం విశేషం. భవిష్యత్లో జాక్ మా నిర్వహణలోని సంస్థలు ఏకుమేకయ్యే ప్రమాదం ఉందని అధ్యక్షుడు జీ జిన్పింగ్ భావించడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.