ధ్యానంపై నాట్స్ ఆన్‌లైన్ ద్వారా అవగాహన

ABN , First Publish Date - 2021-03-01T05:30:00+05:30 IST

ధ్యానంపై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఆన్‌లైన్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ఆధ్యాత్మిక మహా

ధ్యానంపై నాట్స్ ఆన్‌లైన్ ద్వారా అవగాహన

  • ధ్యానం ప్రాముఖ్యత వివరించిన పత్రీజీ  

లాస్ ఏంజిల్స్: ధ్యానంపై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఆన్‌లైన్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ఆధ్యాత్మిక మహా శాస్త్రవేత్త విశ్వ గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ స్వామి ఆన్‌లైన్ ద్వారా అనుసంధానయ్యారు. ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ధ్యానం ఎందుకు చేయాలి..? ధ్యానం మనల్ని ఎలా శక్తిమంతులుగా తీర్చిదిద్దుతుంది. మనస్సును ఎలా నియంత్రణలో ఉంచుతుంది..?  ధ్యానం ఎలా చేయాలి..? ఇలాంటి అంశాలపై ఆన్ లైన్ ద్వారా అవగాహన కల్పించారు. ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా తీసుకెళ్తుందనేది పత్రీజీ వివరించారు.


హింస నుంచి అహింస వైపు ధ్యానం  మనల్ని ఎలా మళ్లిస్తుంది? అజ్ఞానం నుంచి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుంచి దైవత్వం వైపు ధ్యానం నడిపిస్తుందని పత్రీజీ సవివరంగా చెప్పుకొచ్చారు. ఆన్‌లైన్ ద్వారా అనుసంధానమై ప్రశ్నలు అడిగిన వారికి సమాధానాలు ఇచ్చారు. ఆధ్యాత్మికత, ధ్యానానికి  సంబంధించిన ఎన్నో సందేహాలను పత్రీజీ నివృత్తి చేశారు. ఈ ఆన్‌లైన్ కార్యక్రమానికి రాజ్యలక్ష్మి చిలుకూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నాట్స్ లాస్ ఏంజిల్స్ సమన్వయకర్త శ్రీనివాస్ చిలుకూరి, సంయుక్త సమన్వయకర్త మనోహర్ మద్దినేనితో పాటు శంకర్ సింగంశెట్టి తదితర నాట్స్ నాయకులంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 


సునీత సింగంశెట్టి, శారద, మురళి ముద్దనా, సుధాకర్ మారేం, రామ్ బిక్కుమళ్ల, కిరణ్ ఇమ్మిడిశెట్టి, పరి పత్రి, శ్రీకాంత్ గార్ల, నర్సింహా పామిడి, సోహాన దొడ్లే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది తెలుగువారు ధ్యానంపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఆద్యంతం ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా, ఆసక్తికరంగా జరిగిందని ఇందులో పాల్గొన్న తెలుగువారు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-03-01T05:30:00+05:30 IST