ప్యూనును వదిలిపెట్టి, ఇంజనీరును బందీగా పట్టుకున్న నక్సల్స్

ABN , First Publish Date - 2021-11-13T23:01:16+05:30 IST

బిజాపూర్ జిల్లాలో రోడ్డు నిర్మాణానికి సర్వే చేస్తుండగా బందీలుగా పట్టుకెళ్లిన ఇద్దరిలో ఒకరిని..

ప్యూనును వదిలిపెట్టి, ఇంజనీరును బందీగా పట్టుకున్న నక్సల్స్

బిజాపూర్: బిజాపూర్ జిల్లాలో రోడ్డు నిర్మాణానికి సర్వే చేస్తుండగా బందీలుగా పట్టుకెళ్లిన ఇద్దరిలో ఒకరిని ఛత్తీస్‌గఢ్ నక్సల్స్ విడిచిపెట్టినట్టు పోలీసులు శనివారంనాడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ప్యూనుగా పనిచేస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తిని రెండ్రోజుల తర్వాత నక్సల్స్ విడిచిపెట్టగా, సబ్ ఇంజనీర్ రోషన్ లక్రా (35)ను మాత్రం తమ వద్దే  ఉంచుకున్నట్టు చెప్పారు.


ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)కు చెందిన సబ్ ఇంజనీర్ రోషన్ లక్రా, డిపార్ట్‌మెంట్ ప్యూన్ లక్ష్మణ్ గురువారం నుంచి కనిపించకుండా పోయారు. బిజాపూర్ టౌన్ నుంచి గోర్నా-మాంకేలి వరకూ చేపట్టిన 15 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి సర్వేకి వెళ్లిన సమయంలో వీరి ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ ఇద్దరూ శుక్రవారం కూడా బిజాపూర్ జిల్లా ప్రధాన కార్యాలయానికి తిరిగి రాకపోవడంతో వారి జాడ తెలుకునేందుకు గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. గోర్నాకి 4 కిలోమీటర్ల దూరంలోని కన్హాయ్‌గూడ గ్రామం నుంచి వారు అపహరణకు గురయ్యారని చెప్పారు. అయితే, శుక్రవారం సాయంత్రానికి లక్ష్మణ్‌ను ఎత్తుకెళ్లిన ప్రాంతంలోనే సురక్షితంగా విడిచిపెట్టారని, లక్రా మాత్రం నక్సల్స్ చెరలోనే ఉన్నాడని వారు చెప్పారు. ఆయనను సురక్షితంగా విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

Updated Date - 2021-11-13T23:01:16+05:30 IST