సాక్ష్యాలుంటే కోర్టుకు వెళ్లండి: మంత్రిపై ఎన్సీబీ మండిపాటు
ABN , First Publish Date - 2021-11-07T20:16:08+05:30 IST
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్..
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేసిన తాజా ఆరోపణలపై ఎన్సీబీ అధికారులు స్పందించారు. ఆ ఆరోపణలకు తగిన సాక్ష్యాలుంటే ఆయన కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. దుబాయ్, మాల్దీవుల్లో వాంఖడే ఉన్నారని, బీజేపీ నేత మోహిత్ భారతీయ (మోహిత్ కాంబోజ్)తో మాట్లాడారని వాంఖడేపై నవాబ్ మాలిక్ ఆదివారంనాడు తాజా ఆరోపణలు చేశారు.
షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కిడ్నాప్ కుట్రలో సమీర్ వాంఖడే పాత్ర ఉందని, నిజానికి ఇది కిడ్నాప్, బలవంతపు వసూళ్లకు సంబంధించిన కేసు అని నవాబ్ మాలిక్ ఆరోపించారు. క్రూయిజ్ పార్టీలో పాల్గొనేందుకు ఎలాంటి టిక్కెట్టు ఆర్యన్ కొనుగోలు చేయలేదని, ప్రతీక్ గాబ, అమీర్ ఫర్నిచల్వాలాలు ఆర్యన్కు క్రూయిజ్ షిప్పైకి తీసుకు వెళ్లారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఎన్సీబీ అధికారులు వెంటనే స్పందించారు. ఇందుకు తగిన ఆధారాలు ఉంటే నేరుగా కోర్టుకే వెళ్లొచ్చు కదా అని ప్రశ్నించారు. వాంఖడే ఎన్సీబీ ఇన్ఫార్మర్ కాదని, శామ్ డిసౌతో ఎలాంటి పరిచయాలు లేవని అన్నారు.