రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-06-21T05:44:47+05:30 IST

ఫార్మాసిటీలోని రాంకీ సీఈటీపీ ప్లాంట్‌ సమీపంలో శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ప్రమాదంలో మృతి చెందిన రమేశ్‌,... రమేశ్‌ (ఫైల్‌ ఫొటో)

మరొకరికి తీవ్ర గాయాలు

రాంకీ సీఈటీపీ ప్లాంట్‌ సమీపంలో ఘటన

పరవాడ, జూన్‌ 20: ఫార్మాసిటీలోని రాంకీ సీఈటీపీ ప్లాంట్‌ సమీపంలో శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరవాడ జగన్నాథ వీధికి చెందిన రొంగలి రమేశ్‌(26), తాపీమేస్ర్తీగా, రావాడకు చెందిన కె.రాము (28) ప్లంబర్‌గా ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం కూడా విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై ఫార్మాసిటీకి వెళ్లారు. 11.30 గంటల సమయంలో రాంకీ సీఈటీపీ ప్లాంట్‌ సమీపంలో రోడ్డుపై ఉన్న చెక్‌పోస్టు రాడ్‌ను గుర్తించక బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో ఇద్దరు రోడ్డుపై పడిపోగా రమేశ్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాము తలకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రమేశ్‌ మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పరవాడ సీఐ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-06-21T05:44:47+05:30 IST