వేగంగా పనులు పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2021-06-18T04:29:20+05:30 IST
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను
- కొత్త కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్వేతా మహంతి
శామీర్పేట : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. గురువారం శామీర్పేట మండలం అంతాయిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన సముదాయాన్ని (ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్) ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త కలెక్టరేట్ భవనంలో జరుగుతున్న పను లపై ఆరా తీశారు. కలెక్టరేట్లోని అన్ని భవన సముదాయాలను కలియతిరిగి ఇంటర్నల్గా అన్నిరకాల ఏర్పాట్లు ఉండాలని.. వీటితోపాటు తాగునీరు, మూత్రశాలలు, ఇతర వసతులన్నీ కల్పించాలని అధికారులకు సూచించారు. కరోనా నేపథ్యంలో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని, ఏది ఏమైనా జులైలో కొత్త కలెక్టరేట్ భవనం అందుబాటులోకి తీసుకురావాలని ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) శ్రీనివాసమూర్తిని కలెక్టర్ ఆదేశించారు. అందుకుగాను కాంట్రాక్టర్ ఎక్కువ సంఖ్యలో సిబ్బందిని వినియోగించుకొని పనులను పూర్తిచేసేలా చూడాలన్నారు. కలెక్టరేట్ ఆవరణలో పూల మొక్కల తోపాటు నీడనిచ్చే మొక్కలను నాటాలని జిల్లా అటవీశాఖ అధికారి వెంకటే శ్వర్లును ఆదేశించారు. అలాగే కలెక్టరేట్ ఆవరణలో ఇంటర్నెట్ వ్యవస్థ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాసమూర్తి, తహశీల్దార్ తదితరులు ఉన్నారు.