ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సాహిత్య సదస్సు

ABN , First Publish Date - 2020-09-24T20:52:46+05:30 IST

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 158 వ నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు‌ను డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సాహిత్య సదస్సు

డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 158 వ నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు‌ను డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ పాల్గొన్నారు. “ఆధునికతకు అడుగుజాడ-గురజాడ” అన్న అంశంపై ఫ్రొఫెసర్ మేడిపల్లి రవికూమార్ మాట్లాడారు. ఈ నెలలో గురజాడ అప్పారావు జయంతి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నవయుగ కవి, వైతాళికుడు గురజాడ అప్పారావు స్మరణతో ఈ కార్యక్రమం ఆసాంతం నిండుగా సాగింది. 


ప్రారంభంలో చిన్నారులు సాహితీ , సింధూర..  “శివుడు తాండవము సేయునమ్మా” అనే భక్తి గీతం పాడారు. ఎప్పుడూ కార్యక్రమం చివరలో ప్రధాన వక్త ప్రసంగించేవారు.. అయితే ఈ రోజు మాత్రం కార్యక్రమం మొదట్లోనే ఆయన మాట్లాడారు. ‘ఆధునికతకు అడుగుజాడ-గురజాడ’ అన్న అంశంపై ప్రొఫెసర్ మేడిపల్లి రవికూమర్ చర్చిస్తూ.. గురజాడ కేవలం వైతాళికుడే కాక, ముందు చూపు కలిగిన తాత్వాకుడు అని అభిప్రాయపడ్డారు. సమకాలీన సమాజంలో పీడనకు గురైన స్త్రీజాతిని.. గురజాడ అప్పారావు మొదటగా జాగృతం చేసినట్లు తెలిపారు.   



ఎప్పటిలాగే “మనతెలుగు సిరి సంపదలు” శీర్షికన జాతీయాలు,  పొడుపు కథల పరంపరను ఉరుమిండి నరసింహా రెడ్డి కొనసాగించారు. వాటికి తోడుగా తెలుగు సాహితీ జగత్తులోని ప్రసిద్ధ కవితాపంక్తులను, కొన్ని ప్రహేళికలను ప్రశ్నలు జవాబుల రూపంలో కార్యక్రమంలో పాల్గొన్న వారిని చర్చలో భాగస్వాములను చేశారు. ఉపద్రష్ట సత్యం.. పద్య సౌగంధం శీర్షికన మల్లికార్జున భట్టు రాసిన భాస్కర రామాయణంలోని చక్కని శార్దూల పద్యాన్ని అర్థతాత్పర్య సహిత విశేషాలతో వివరించారు. శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు “మాసానికో మహనీయుడు” అనే శీర్షక కొనసాగింపుగా.. సెప్టెంబరు నెలలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులను ప్రజెంటేషన్ ద్వారా సభకు గుర్తు చేశారు. జాషువా లాంటి ఎందరో మహనీయులు సెప్టెంబర్‌లోనే జన్మించినట్లు ఆయన వెల్లడించారు. చివరి రెండు అంశాలుగా లెనిన్ బాబు వేముల, మద్దుకూరి చంద్రహాస్..  ప్రారంభ దశలో గురజాడ రాసిన రచనలనూ, ఆంగ్ల సాహిత్యంలోకి ఆయన ప్రవేశాన్ని గుర్తు చేశారు. అనంతరం గురజాడ అప్పారావుకు  నివాళులర్పించారు.


ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు.. ముఖ్య అతిథి  ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ గారికి, ప్రార్థనా గీతం పాడిన సాహితీ, సింధూరలకు, వక్తలకు, కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు పాలక మండలి తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో మాధవి రాణి, శశికళ పట్టిసీమ, విష్ణు ప్రియ, మాధవి ముగ్ధ, శ్రీనివాస్ బసాబత్తిన, ప్రసాద్ తోటకూర, సురేష్ కాజా, చంద్రహాస్, ఆచార్యులు జగదీశ్వరన్ పూదూరు, ఉత్తరాధ్యక్షురాలు లక్ష్మి పాలేటి, పూర్వాధ్యక్షుడు చిన సత్యం వీర్నపు, సునిల్ కుమార్, తవ్వా వెంకటయ్య, సుబ్బ రాయుడు, బసవ రాజప్ప తదితర్లు  ఉన్నారు. 

Updated Date - 2020-09-24T20:52:46+05:30 IST