పరిపాలన చేతకాక.. విగ్రహాలపై దాడులు: రవిచంద్ర

ABN , First Publish Date - 2022-01-03T18:28:24+05:30 IST

పరిపాలన చేత కాక..వైసీపీ నేతలు విగ్రహాలపై దాడులకు దిగుతున్నారని టీడీపీ నేత రవిచంద్ర విమర్శించారు.

పరిపాలన చేతకాక.. విగ్రహాలపై దాడులు: రవిచంద్ర

నెల్లూరు జిల్లా: గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ద్వంసం ఘటనపై నెల్లూరు జిల్లాలో టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పరిపాలన చేత కాక.. వైసీపీ నేతలు విగ్రహాలపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా రాష్ట్రంలో ఎన్టీఆర్, అంబేద్కర్, రాజకీయ పార్టీలకు సంబంధించిన చిహ్నాలను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన విగ్రహాల ధ్వంసంపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదని రవిచంద్ర మండిపడ్డారు. 


పట్టపగలు, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అధికార పార్టీ వైసీపీకి చెందిన జడ్పీటీసీ కుమారుడు సుత్తి తీసుకుని దివంగత నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ధ్వసం చేయడానికి యత్నించడం కలకలం రేపింది. సేకరించిన వివరాల మేరకు.. దుర్గి మండల జడ్పీటీసీ శెట్టిపల్లి యలమంద కుమారుడు కోటేశ్వరరావు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మండల కేంద్రమైన దుర్గిలోని బస్టాండ్‌ సెంటర్‌కు వచ్చాడు. ఆ సమయంలో అతని చేతిలో సుత్తి ఉంది. అది తీసుకుని అక్కడే ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పగులగొట్టే ప్రయత్నం చేశాడు. అలా ఒకటి రెండు సార్లు సుత్తితో కొట్టాడు. దీంతో విగ్రహం పాక్షికంగా ధ్వంసం అయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న దుర్గి పోలీసులు అక్కడకు చేరుకుని కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉంటే ఏడాదిన్నర కిందట మాచర్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు దుర్గిలో ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసానికి యత్నించారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఆగ్రహజ్వాలలు పెరిగాయి. కానీ సంయమనం పాటించాల్సిందిగా నియోజకవర్గ, జిల్లా నేతలు తమ పార్టీ కార్యకర్తలు సూచిస్తున్నారు. 

Updated Date - 2022-01-03T18:28:24+05:30 IST