Nellore: పెన్నానది ఉధృతి... నీట మునిగిన గ్రామాలు

ABN , First Publish Date - 2021-11-20T16:35:00+05:30 IST

జిల్లాలో భారీ వర్షాల కారణంగా పెన్నాదికి వరద ఉధృతి అధికంగా ఉంది. పొర్లుకట్టలు ఎక్కడికక్కడే తెగిపోతున్నాయి.

Nellore: పెన్నానది ఉధృతి... నీట మునిగిన గ్రామాలు

నెల్లూరు: జిల్లాలో భారీ వర్షాల కారణంగా పెన్నాదికి వరద ఉధృతి అధికంగా ఉంది. పొర్లుకట్టలు ఎక్కడికక్కడే తెగిపోతున్నాయి. వరద నీరు గ్రామాలను ముంచెత్తుతోంది. దాదాపు 30 గ్రామాలు నీట మునిగాయి. అటు నగరంలోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. భగత్ సింగ్ కాలనీ, జనార్ధన్ రెడ్డి కాలనీ, జయలలిలతా నగర్, పొర్లుకట్ట, ఈద్గా కాలనీ, శివగిరి కాలనీ, మన్సూర్ నగర్, మనుమసిద్ది నగర్, పుట్టా ఎస్టేట్, తల్పగిరికాలనీలు నీట మునిగాయి. భగత్ సింగ్ కాలనీ వద్ద జగనన్న ఇళ్ల స్థలాల్లోకి పదిహేను అడుగుల మేర వరద నీరు‌ వచ్చి చేరింది. వరినార్లు నీట మునగగా... పొగాకు, మినుము, నిమ్మ రైతులకి అపారనష్టం వాటిల్లింది.


పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనేక గ్రామాలు చీకట్లలో మగ్గుతున్నాయి. గూడూరు సమీపంలో పంబలేరు వాగు పొంగడంతో, కలకత్తా - చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దామరమడుగు, సంగం ప్రాంతాల్లో ముంబాయి జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచాయి. విజయవాడ - చెన్నై, విజయవాడ - తిరుపతి మధ్య రైళ్లు గంటల సమయం పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. పలుచోట్ల సముద్రం ముందుకొచ్చింది. దీంతో తీరప్రాంత గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2021-11-20T16:35:00+05:30 IST