భారత దేశంలోని కాలాపానీలో జనాభా లెక్కల సేకరణకు నేపాల్ యత్నాలు

ABN , First Publish Date - 2020-09-24T22:27:25+05:30 IST

పొరుగు దేశాలకు పెద్ద పీట వేసి, ఆత్మీయంగా ఆదరిస్తున్న భారత దేశంపై నేపాల్ విషం చిమ్ముతోంది. భారత భూభాగాలైన లిపులేఖ్, లింపియధుర,

భారత దేశంలోని కాలాపానీలో జనాభా లెక్కల సేకరణకు నేపాల్ యత్నాలు

న్యూఢిల్లీ : పొరుగు దేశాలకు పెద్ద పీట వేసి, ఆత్మీయంగా ఆదరిస్తున్న భారత దేశంపై నేపాల్ విషం చిమ్ముతోంది. భారత భూభాగాలైన లిపులేఖ్, లింపియధుర, కాలాపానీ ప్రాంతాల్లో జనాభా లెక్కల సేకరణకు నేపాల్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రశ్నావళిని ఇప్పటికే తయారు చేసింది. 


అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, భారత దేశంలోని ఉత్తరాఖండ్, హిమాలయ ప్రాంతంలో పితోరాగఢ్‌లో జనాభా లెక్కల సేకరణకు నేపాల్ దుస్సాహసం చేస్తోంది. ఈ ప్రాంతంలోని లిపులేఖ్, లింపియధుర, కాలాపానీలలో జనాభా లెక్కలను సేకరించేందుకు ప్రశ్నావళిని రూపొందించింది. 


నేపాల్‌లో పదేళ్ళకోసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. 2021 మే నెలలో తదుపరి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. లిపులేఖ్, లింపియధుర, కాలాపానీలను తమ భూభాగాలుగా పేర్కొంటూ కొత్తగా ఓ మ్యాప్‌ను నేపాల్ ఈ ఏడాది జూన్ 13న ఆమోదించింది. దీనిని పాఠశాలల అచ్చు పుస్తకాల్లో కూడా ప్రచురించింది. అదేవిధంగా నాణేలపై కూడా ముద్రించింది. 


బుధి గ్రామస్థులు మాట్లాడుతూ, తాము నేపాల్ నిర్వహించే జనాభా లెక్కల సేకరణలో పాల్గొనబోమని చెప్పారు. తాము భారత దేశ పౌరులమని తెలిపారు. నేపాల్ ప్రభుత్వం చేపట్టే జనాభా లెక్కల సేకరణలో తాము ఎందుకు పాల్గొనాలని ప్రశ్నించారు. 


పితోరాగఢ్ జిల్లా అధికారులు మాట్లాడుతూ తమ జిల్లాలో జనాభా లెక్కల సేకరణకు నేపాల్ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, ఆ దేశ అధికారులను అనుమతించేది లేదని తెలిపారు. నేపాల్ ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తమకు సమాచారం లేదన్నారు. 


నేపాల్ కొత్త మ్యాప్‌పై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఏకపక్షంగా ఇటువంటి చర్యలకు పాల్పడరాదని, కృత్రిమంగా భూభాగాలను విస్తరించుకోవడం మానుకోవాలని తెలిపింది. 


Updated Date - 2020-09-24T22:27:25+05:30 IST