పాక్లో కృష్ణుడి ఆలయం పూర్తి చేయండి.. నేపాల్ హిందువుల నిరసనలు
ABN , First Publish Date - 2020-07-14T01:02:27+05:30 IST
పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా నేపాల్లోని హిందువులు నిరసన తెలిపారు. ఖాట్మండులోని పాకిస్తాన్ ఎంబసీ వద్ద...
ఖాట్మండు: పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా నేపాల్లోని హిందువులు నిరసన తెలిపారు. ఖాట్మండులోని పాకిస్తాన్ ఎంబసీ వద్ద హిందూ సంఘ కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో నిర్మాణ దశలో నిలిచిపోయిన కృష్ణుడి ఆలయాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంబసీ ముందు పాక్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. హిందువులపై జరుగుతున్న అన్యాయాలను నిలువరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా అభియాన్ కార్యకర్త వినయ్ యాదవ్ మాట్లాడుతూ, పాకిస్తాన్లో మానవ హక్కులు దెబ్బతింటున్నాయని, దానిని తాము ముక్తకంఠంతో ఖండిస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉంటే ఇస్లామాబాద్లో నిర్మితమవుతున్న కృష్ణుడి ఆలయాన్ని అక్కడి హిందూ పెద్దలు నిలిపివేశారు. ఆలయ ప్రహరీని ఎవరో దుండగులు ధ్వంసం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్లామాబాద్ హిందూ పంచాయత్ ప్రకటించినట్లు తెలుస్తోంది.