మనుషుల పుర్రెలు, అస్థిపంజరాల్ని భారత్ నుంచి ఎందుకు తీసుకెళ్తున్నారు.. సరిహద్దుల్లో షాకింగ్ ఘటన..!

ABN , First Publish Date - 2021-10-09T00:40:48+05:30 IST

ఇండియా-నేపాల్ సరిహద్దులో చోటు చేసుకున్న ఓ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నేపాల్ వెళ్తున్న కొందరు వ్యక్తులను అడ్డగించి.. వారి కారును తనిఖీ చేసిన అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. కారులో భారీ మొత్తంలో మనుషుల పుర్రెలు, అస్థిపంజరాలను చూసి

మనుషుల పుర్రెలు, అస్థిపంజరాల్ని భారత్ నుంచి ఎందుకు తీసుకెళ్తున్నారు.. సరిహద్దుల్లో షాకింగ్ ఘటన..!

ఇంటర్నెట్ డెస్క్: ఇండియా-నేపాల్ సరిహద్దులో చోటు చేసుకున్న ఓ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నేపాల్ వెళ్తున్న కొందరు వ్యక్తులను అడ్డగించి.. వారి కారును తనిఖీ చేసిన అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. కారులో భారీ మొత్తంలో మనుషుల పుర్రెలు, అస్థిపంజరాలను చూసి అధికారులు కంగుతిన్నారు. దీంతో ఆ వ్యక్తులు పెద్ద మొత్తంలో పుర్రెలు, అస్థిపంజరాలను ఎందుకు అక్రమంగా రవాణా చేస్తున్నారనే అంశం ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్ అయింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



బిహార్‌లోని అరారియా ప్రాంతం నేపాల్‌తో సరిహద్దును కలిగి ఉంది. ఈ ప్రాంతం గుండా నేపాల్‌కు భూమార్గం కూడా ఉండటం వల్ల ఇరు దేశాలకు చెందిన వందలాది మంది ప్రయాణికులు రెండు దేశాల మధ్య ప్రయాణం చేస్తూ ఉంటారు. రెండు దేశాల మధ్య రాకపోకలు సాగించడానికి భూమార్గం ఉండటమే కాకుండా సరిహద్దు ప్రాంతం కావడంతో ఇరు దేశాల సైనికులు నిత్యం అక్కడ పహారా కాస్తూ ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉంటారు. ఈ తనిఖీలో భాగంగానే తాజాగా భారత్ నుంచి నేపాల్‌కు కారులో వెళ్తున్న కొందరు ప్రయాణికులను ఆ దేశ ఆర్మీ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం కారును పరిశీలించిన అధికారులు అందులో దాదాపు 28 మనుషుల అస్థిపంజరాలను, పుర్రెలను చూసి షాకయ్యారు. వాటిని స్వాధీనం చేసుకుని.. అక్రమంగా పుర్రెలను, అస్థింజరాలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 



ఇదిలా ఉంటే.. మెడికల్ కాలేజీల్లో పుర్రెలు, అస్థిపంజరాలను ఉపయోగించి మానవ శరీరానికి సంబంధించిన అంశాలను అధ్యాపకులు విద్యార్థులకు బోధిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 1985 వరకూ దాదాపు 80శాతం ఎముకలు భారత్ నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేవి. కానీ 1985లో భారత ప్రభుత్వం ఈ ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని కొంత మంది అవకాశంగా తీసుకుని అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. ధనార్జనే ధ్యేయంగా భారీ మొత్తంలో మనుషుల పుర్రెలు, అస్థిపంజారాలను నేపాల్‌కు అక్రమంగా తరలించి.. ఆ తర్వాత విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం.


Updated Date - 2021-10-09T00:40:48+05:30 IST