ఫైనల్స్ అని భయపడలేదు: నీరజ్ చోప్రా
ABN , First Publish Date - 2021-08-08T06:37:58+05:30 IST
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి స్వర్ణం అందించి జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఈ దఫా విశ్వ క్రీడల్లో స్వర్ణం లేకుండానే ..
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి స్వర్ణం అందించి జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఈ దఫా విశ్వ క్రీడల్లో స్వర్ణం లేకుండానే భారత్ ఇంటి ముఖం పడుతుందేమోనని అందరూ భయపడినా.. ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలోకి దిగిన నీరజ్.. పసిడి సాధించి శభాష్ అనిపించాడు. ప్రస్తుతం అతడికి దేశం మొత్తం బ్రహ్మరథం పడుతోంది. అయితే ప్రపంచ దేశాల ఆటగాళ్లంతా పోటీ పడే ఒలింపిక్స్ ఫైనల్స్ అంటే మహా మహా ఆటగాళ్లే కొంత కంగారు పడతారు. అయితే నీరజ్ మాత్రం సునాయాసంగా ఫైనల్స్లో మిగతావారిని అధిగమించాడు. ఎక్కడా ఒత్తిడికి తలొగ్గకుండా గెలుపు సాధించాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన నీరజ్.. ఫైనల్స్లో ఆడుతున్నాననే ఆలోచన తనలో ఏమాత్రం ఒత్తిడి కలిగించలేదని నీరజ్ చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు కూడా రెండు, మూడు అంతర్జాతీయ టోర్నీల్లో ఆడడం వల్లనే ప్రశాంతంగా ఆడగలిగానని అన్నాడు.
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాలనుకన్నా.. కానీ..
ఒలింపిక్స్లో బంగారు పతకంతో గెలిచినా నీజర్ ఓ విషయంలో కొంత నిరాశగా ఉన్నాడు. జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు అయితే 90.57 మీటర్ల రికార్డును అధిగమించలేకపోయినందుకు కొంత బాధగా ఉందని నీరజ్ చెప్పాడు. తన శాయశక్తులా ప్రయత్నించానని, కానీ సాధ్యం కాలేదని అన్నాడు. త్వరలో 90 మీటర్ల మార్క్ను దాటుతానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా.. నీరజ్ చోప్రా ఫైనల్స్లో 87.58 మీటర్లు దూరం జావెలిన్ విసిరి గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.