అమర్యాదలు..అసంతృప్తులు

ABN , First Publish Date - 2020-11-28T06:38:13+05:30 IST

వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే

అమర్యాదలు..అసంతృప్తులు

 పొరుగు జిల్లాల ముఖ్యనేతల నారాజ్‌

 అధికార పార్టీ అభ్యర్థుల తీరుతో అసహనం

 నాలుగు రోజులు ఓపిక పట్టాలని ఇన్‌చార్జిల హితవు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన  అధికార పార్టీ ఎమ్మెల్యేకు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని నాలుగు డివిజన్లను ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ప్రచారానికి తన  నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు 100 మందిని రప్పించి ఐదు రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్ల అభిప్రాయాలను, ముందుకు సాగాల్సిన విధానాలను ఓ అభ్యర్థికి  సదరు ఎమ్మెల్యే చెప్పగా, అతను పెడచెవిన పెట్టినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే ఎవరికి చెప్పకుండా వెళ్లినట్లు సమాచారం.

మంచిర్యాల జిల్లా మంత్రిని మల్కాజిగిరి నియోజకవర్గంలోని పలు డివిజన్లకు ఇన్‌చార్జిగా నియమించారు. ఇద్దరు కార్పొరేటర్‌ అభ్యర్థులకు చివరి రోజు పోలింగ్‌ స్లిప్పులు, ఇతర వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవాలని, పోలింగ్‌ రోజు ఒక్క ఓటు కూడా పోగొట్టుకోవద్దని మంత్రి చెప్పినట్లు తెలిసింది. దీనిపై వారు స్పందిస్తూ ‘ఓట్లు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలుసన్నా.. మీరు పరేషాన్‌ కాకుండి..!’ అని అనడంతో మంత్రి నారాజ్‌ అయినట్లు తెలిసింది. 

గ్రేటర్‌లో మరోసారి అత్యధిక డివిజన్లు సొంతం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌  డివిజన్ల బాధ్యతలను పొరుగు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. అభ్యర్థుల వైఖరితో ఇన్‌చార్జిలుగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు కొంత అసహనానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, వారి వెంట వచ్చిన కార్యకర్తలు, అనుచరులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లగా, అభ్యర్థులను మందలించినట్లు సమాచారం. కాగా, అభ్యర్థుల తీరుతో నేతల వెంట వచ్చిన కార్యకర్తలు వెనక్కి వెళ్లిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని పోలింగ్‌ వరకు ఓపిక పట్టాలని, అధిష్ఠానం ఆదేశాల మేరకు అభ్యర్థులను గెలిపించాలని ఇన్‌చార్జిలు సముదాయిస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2020-11-28T06:38:13+05:30 IST