నేటి నుంచి కసుమూరు దర్గా దర్శనానికి అనుమతి
ABN , First Publish Date - 2021-06-22T04:36:25+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ వలీ దర్గాను కరోనా సెకండ్ వేవ్ కారణంగా గత కొద్దినెలల కిందట మూసివేసిన విషయం తెలిసిందే.
జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అలీ బాషా
వెంకటాచలం, జూన్ 21 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ వలీ దర్గాను కరోనా సెకండ్ వేవ్ కారణంగా గత కొద్దినెలల కిందట మూసివేసిన విషయం తెలిసిందే. అయితే సోమవారం మండలంలోని కసుమూరు గ్రామంలో ఉన్న మస్తాన్వలీ దర్గా కార్యాలయంలో గ్రామస్థులు, నాయకులతో జిల్లా వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ అలీ బాషా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో మంగళవారం నుంచి కసుమూరు దర్గా దర్శనానికి భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కర్ఫ్యూ సడలింపు నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు బయట తిరిగేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఈ క్రమంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్గా లోనికి భక్తులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ మాస్కులు, సామాజిక దూరం, శానిటైజర్ల వినియోగం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కడివేటి శివ, ఉపసర్పంచ్ పఠాన్ బాబర్, ఏఎంసీ డైరెక్టర్ చికూర్తి నరసయ్య, నాయకులు పఠాన్ హుస్సేన్, ఎంఎస్ మొహ్మద్, కేఎస్ మౌలనా తదితరులున్నారు.