ఐపీఎల్ అంటే అంత కుళ్లెందుకు.. అఫ్రిదీపై మండిపడుతున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2021-04-09T02:38:27+05:30 IST

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఐపీఎల్‌ అంటే ఎందుకంత కుళ్లుకుంటున్నావంటూ విమర్శిస్తున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను పాక్ గెలుచుకున్న సందర్భంగా అఫ్రిదీ మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్‌ను విమర్శించాడు. ఓ పక్క సిరీస్ కొనసాగుతుండగానే..

ఐపీఎల్ అంటే అంత కుళ్లెందుకు.. అఫ్రిదీపై మండిపడుతున్న నెటిజన్లు

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఐపీఎల్‌ అంటే ఎందుకంత కుళ్లుకుంటున్నావంటూ విమర్శిస్తున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను పాక్ గెలుచుకున్న సందర్భంగా అఫ్రిదీ మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్‌ను విమర్శించాడు. ఓ పక్క సిరీస్ కొనసాగుతుండగానే సౌత్‌ఆఫ్రికా జట్టు తమ ఆటగాళ్లను ఐపీఎల్ కోసం విడుదల చేయడాన్ని అఫ్రిది తప్పుబట్టాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్‌కు దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి నిర్ణయాలపై జాతీయ క్రికెట్ బోర్డులు పునరాలోచన చేయాలని సూచించాడు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘ఓ వైపు సిరీస్‌ కొనసాగుతుండగానే, మరోవైపు ఐపీఎల్‌ కోసం సీఎస్‌ఏ ఆటగాళ్లను విడుదల చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. టీ20 లీగ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌ను ఈవిధంగా ప్రభావితం చేయడం నిజంగా బాధాకరం. ఇలాంటి నిర్ణయాలపై జాతీయ క్రికెట్ బోర్డులు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు.


అఫ్రిది చేసిన ఈ కామెంట్లపై నెటిజన్లు నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ ఐపీఎల్ ఆడడం లేదు కనుకే అఫ్రిదీ ఇలాంటి విమర్శలు చేస్తున్నాడని, ఒకవేళ వారు కూడా ఆడుతూ ఉంటే సౌత్‌ఆఫ్రికాకంటే ముందు వాళ్లే ఇక్కడుండేవారని ఎద్దేశా చేస్తున్నారు. ఐపీఎల్ జరుగుతున్నందున టీ20 లీగ్‌లపై అఫ్రిదీకి ఎక్కడలేని కోపం వచ్చిందని, కానీ అతడు కూడా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ఆడిన విషయం మర్చిపోయాడని విమర్శిస్తున్నారు. 



Updated Date - 2021-04-09T02:38:27+05:30 IST