కొత్త కోర్సులు
ABN , First Publish Date - 2021-06-24T06:11:26+05:30 IST
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్షరింగ్లో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి.
సంస్థను పరిచయం చేసే వీడియో విడుదల
కర్నూలు(ఎడ్యుకేషన్), జూన్ 23: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్షరింగ్లో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంటెక్లో మూడు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నామని ట్రిపుల్ఐటీడీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ డీవీఎల్ఎన్ సోమయాజులు తెలిపారు. క్యాంపస్లో ఇన్స్టిట్యూట్ ప్రమోషన్ వీడియోతో పాటు మూడు ఎంటెక్ కొత్త కోర్సుల బ్రోచర్ను బుధవారం ఆయన విడుదల చేశారు.
ఫ సీఎస్ఈ బ్రాంచ్లో ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా అనలథిటిక్ అండ్ డెసిషన్స్ సైన్స్, ఈసీఈ బ్రాంచ్లో ఎంటెక్ ఎలక్ర్టానిక్ సిస్టమ్ డిజైన్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఎంటెక్ ఇన్ స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ కోర్సును ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
ప్రతి కోర్సులో 45 సీట్లు ఉంటాయని, వీటితో పాటు బీటెక్ ప్రొగ్రామింగ్కు సంబంధించి మైనర్ రిలేటెడ్ కోర్సులను అందుబాటులోకి తెచ్చామని ప్రకటించారు. అడ్మిషన్లన్నీ సెంట్రలైజింగ్ కౌన్సెలింగ్ ఫర్ ఎంటెక్ (సీసీఎంపీ-2021) ప్లాట్ఫాం ద్వారా చేపడుతారన్నారు. నూతన విద్యాసంవత్సరంలో ట్రిపుల్ ఐటీలో చేరే విద్యార్థులకు సంస్థ స్థితిగతులను తెలియజేసేందుకే వీడియోను విడుదల చేశామని, దీన్ని ఫేస్బుక్, వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు.
పీహెచ్డీ కోర్సులకు 300 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో పరిశ్రమలు, అకడమిక్ వైపు నుంచి 45, కళాశాలల నుంచి మిగతా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారికి పీహెచ్డీ అడ్మిషన్లు ఇస్తామని తెలిపారు.
భవన నిర్మాణ పనులకు రూ.250 కోట్లు మంజూరు కాగా రూ.218 కోట్లు విడుదలయ్యాయన్నారు. ప్రహరీ నిర్మాణం సగంలో ఆగిపోయిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిందని వెల్లడించారు. అసంపూర్తి పనులకు నిధులు ఇవ్వాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. 20 నెలల్లో అకడమిక్ బ్లాక్, ల్యాబొరేటరీ బ్లాక్, డైరెక్టర్ రెసిడెన్సీ, 20 ఫ్యాకల్టీ క్వార్టర్స్, జీ+ఎన్ హాస్టల్ బ్లాక్, నాలుగు అంతస్తుల డైనింగ్ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉందన్నారు.
వివిధ అభివృద్ధి పరిశోధనలు చేసినందుకు చైర్మన్ రంగనాథ్కు బెంగుళూరు యూనివర్సిటీ అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నామని అకడమిక్ ఇన్చార్జి ప్రొ.ఈశ్వర్మూర్తి తెలిపారు. సిలబస్ పూర్తి చేసి, పరీక్షలను సకాలంలో నిర్వహిస్తామని తెలిపారు. సరైన సమయంలో డిగ్రీలు ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్య అభ్యసించడానికి వీలు కల్పిస్తున్నామని అన్నారు. ఆన్లైన్ క్లాసులకు గైర్హాజరు అయినవారి కోసం వీడియోలను అందుబాటులో ఉంచామని తెలిపారు. వారానికి ఒక టెస్టు, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. డిగ్రీలో సాధించిన మార్కుల కంటే, ఉద్యోగం సాధించడమే ముఖ్యమని ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రొ.కృష్ణయ్య అన్నారు. గత మూడేళ్లలో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైన ఒకొక్కరు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ప్యాకేజీని పొందుతున్నారన్నారు.