మరో ప్రయత్నం... భద్రాద్రి దేవస్థానం అభివృద్ధిపై కొత్త ఆశలు

ABN , First Publish Date - 2021-01-20T04:11:21+05:30 IST

ప్రసిద్ధ రామక్షేత్రమైన భద్రాచలం అభివృద్ధి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతానికి ఇది ఒక ప్రయత్నమే అయినా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రసాద్‌’ (ఫిలిగ్రమేజ్‌ రెజువేషన్‌ అండ్‌ స్పిరుచ్‌వల్‌ అగ్‌మెంటేషన్‌ డ్రైవ్‌) కార్యక్రమంలో ఈ క్షేత్రాన్ని పొందుపరచాలని రాష్ట్ర పర్యాటక శాఖ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

మరో ప్రయత్నం... భద్రాద్రి దేవస్థానం అభివృద్ధిపై కొత్త ఆశలు
భద్రాచలం రామాలయం

కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్‌’ పథకంలో చేర్చే యోచన 

కసరత్తు చేస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ

క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆర్కిటెక్ట్‌లు

భద్రాచలం, జనవరి 19: ప్రసిద్ధ రామక్షేత్రమైన భద్రాచలం అభివృద్ధి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతానికి ఇది ఒక ప్రయత్నమే అయినా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రసాద్‌’ (ఫిలిగ్రమేజ్‌ రెజువేషన్‌ అండ్‌ స్పిరుచ్‌వల్‌ అగ్‌మెంటేషన్‌ డ్రైవ్‌) కార్యక్రమంలో ఈ క్షేత్రాన్ని పొందుపరచాలని రాష్ట్ర పర్యాటక శాఖ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌రావుతో పాటు ఇతర అధికారులు ఇటీవల భద్రాచలం, పర్ణశాలలను సందర్శించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పరిశీలన చేశారు. ప్రస్తుతం వీటన్నింటిని క్రోడీకరించి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించే కసరత్తు జరుగుతోంది. అయితే ఇప్పటికి ఇది ఒక ప్రయత్నమేనని ఉన్నతాధికారులు చెబున్నారు.  

కాలయాపనే.. కార్యాచరణేది ?

దక్షణ అయోధ్యగా పేరుపొందిన భద్రాచలాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ప్రభుత్వం పలుమార్లు ప్రకటనలు చేసింది. గతంలో  రామయ్య కల్యాణానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ భద్రాద్రి దేవస్థానం అభివృద్ధికి రూ.100కోట్లను  ప్రకటించారు. ఈ క్రమంలో రెండుసార్లు రూ.150 కోట్లకు రాష్ట్ర బడ్జెట్‌లో ఆమోదింపజేశారు. కానీ ఇంతవరకు ఒక్కపైసా నిధులు ఇవ్వలేదు. రామాలయ అభివృద్ధి జరగలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం ‘రామాయణం సర్క్యూట్‌’లో భాగంగా రాముడు నడయాడిన భద్రాచలం క్షేత్రాన్ని ఈ కార్యక్రమంలో పొందుపరుస్తున్నట్లు ప్రకటించింది. కానీ తరువాత ఆ సర్క్యూట్‌ నుంచి భద్రాచలాన్ని తొలగించారనే ప్రచారం ఉన్నతాధికార వర్గాల్లో వినిపించింది. అదేవిధంగా గతంలో జిల్లా కలెక్టరుగా పనిచేసిన ఓ ఉన్నతాధికారి సింగరేణి నుంచి ప్రత్యేక నిధులతో భద్రాద్రి రామాలయ, కరకట్ట పరిసరాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ మూడు ప్రయత్నాల్లోనూ ఆలయ అభివృద్ధి అంశాలపై మాస్టర్‌ప్లాన్‌పై కసరత్తు చేసి తుదిదశకు తీసుకెళ్లారు. దేవాదాయ శాఖ భద్రాచలం దేవస్థానం ఆర్కిటెక్ట్‌గా ఆనంద్‌సాయిని నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కానీ ఆ తరువాత ఆ ప్రణాళికలపై ఎటువంటి కదలిక లేక ప్రతిపాదనలన్ని అమలుకు నోచుకోలేకపోయాయి. ఈ పరిస్థితిని రామ భక్తులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. 

ప్రారంభమైన మరో ప్రయత్నం

ఇలాంటి పరిస్థితుల్లో భద్రాద్రి రామాలయ అభివృద్ధికి మరో ప్రయత్నం ప్రారంభమైంది. ఈసారి రాష్ట్ర పర్యాటక శాఖ కసరత్తు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల రెండు రోజులుగా  పర్యాటక శాఖ తరపున ఆర్కిటెక్టులు భద్రాచలం, పర్ణశాలల్లో క్షేత్రస్థాయిలో రామాలయ పరిసరాలు పరిశీలించారు. చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై నిశితంగా పరిశీలించారు. రామాలయ పరిసరాలకు సంబంధించిన ఫొటోలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్‌’ కార్యక్రమంలో  ఆలయాభివృద్దికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి నిధులు సమీకరించే యోచనలో పర్యాటక శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-01-20T04:11:21+05:30 IST