ఒకే ఆసుపత్రిలో మృతిచెందిన భార్యాభర్తలు.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2020-04-09T00:45:31+05:30 IST

అమెరికాలో కరోనా బారిన పడి భర్త చనిపోగా.. ఆ మరణవార్తను తట్టుకోలేక భార్య చనిపోయింది. వీరిద్దరూ ఒకే ఆసుపత్రిలో చనిపోవడం గమనార్హం.

ఒకే ఆసుపత్రిలో మృతిచెందిన భార్యాభర్తలు.. కారణమేంటంటే..

న్యూజెర్సీ: అమెరికాలో కరోనా బారిన పడి భర్త చనిపోగా.. ఆ మరణవార్తను తట్టుకోలేక భార్య చనిపోయింది. వీరిద్దరూ ఒకే ఆసుపత్రిలో చనిపోవడం గమనార్హం. అమెరికాలోని న్యూజెర్సీలో ఈ విచారకరమైన సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆల్ఫ్రెడో(68), సూసానా(64) కొద్ది రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లి వచ్చారు. ఆ తరువాత ఆల్ఫ్రెడో ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. మార్చి 17న ఆల్ఫ్రెడోను ఆసుపత్రిలో చేర్చగా కరోనా పాజిటివ్ అని తేలింది. మరోపక్క అసిస్టెంట్ నర్స్‌గా పనిచేస్తున్న సూసానా ఆరు రోజుల తరువాత జ్వరంతో ఆసుపత్రిలో చేరింది. వీరిద్దరూ కూడా నార్త్ బెర్జెన్ ప్రాంతంలోని హ్యాకెన్‌శాక్ మెడికల్ సెంటర్‌లోనే చికిత్స పొందుతూ వచ్చారు. ఇదే సమయంలో తన భర్త మరణించాడన్న వార్తను విని సుసానా కుమిలిపోయింది. తనకు చికిత్స చేయించుకోవడం కూడా ఇష్టం లేదంటూ వైద్యులతో, కుటుంబసభ్యులతో వాదించింది. కాగా.. భర్త చనిపోయిన నాలుగు రోజుల తర్వాత సూసానా కూడా ప్రాణాలు విడిచింది. సుసానాకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించామని, ఫలితాలు రాకముందే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు. తన తల్లితండ్రులిద్దరూ 44 సంవత్సరాల నుంచి భార్యాభర్తలుగా మంచి జీవితాన్ని గడిపుతూ వచ్చారని, ఒకేసారి ఇలా ఇద్దరిని పోగొట్టుకోవడం ఎంతో బాధగా ఉందని కూతురు కన్నీటి పర్యంతమైంది.

Updated Date - 2020-04-09T00:45:31+05:30 IST