సుందరీకరణ పనులు పూర్తయితే నిర్మల్‌కు కొత్తశోభ

ABN , First Publish Date - 2021-05-14T06:27:01+05:30 IST

నిర్మల్‌ పట్టణంలో చేపట్టిన సుందీకరణ పనులు పూర్తయితే కొత్త శోభ సంతరించుకుంటుందని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.

సుందరీకరణ పనులు పూర్తయితే నిర్మల్‌కు కొత్తశోభ
నిర్మల్‌ పట్టణంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌, మే (ఆంధ్రజ్యోతి) 13 : నిర్మల్‌ పట్టణంలో చేపట్టిన సుందీకరణ పనులు పూర్తయితే కొత్త శోభ సంతరించుకుంటుందని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్‌ జిల్లాలోని గాజులపేట్‌ నుంచి ఆలూర్‌ గ్రామం వరకు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్‌ జిల్లా కేంద్రంగా ఏర్పాటైన తర్వాత శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కడ్తాల్‌ నుంచి సోఫీనగర్‌ వరకు రూ.4 కోట్లతో రోడ్డు డివైడర్‌, రహదారి మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. రూ.ఐదున్నర కోట్లతో మంచిర్యాల్‌ చౌరస్తా నుంచి గాజులపేట్‌ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేసి సుందరీకరణ పనులు చేపడతామన్నారు. రామ్‌రావు బాగ్‌లో జౌళినాళ పూడికతీత పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ జి.ఈశ్వర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌ పాల్గొన్నారు. 

రంజాన్‌ పండగ ఎంతో పవిత్రమైంది

నిర్మల్‌ కల్చరల్‌, మే 13 : రంజాన్‌ పండగ ఎంతో పవిత్రమైందని ముస్లిం సోదరులకు సుఖ శాంతులు నింపాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆకాంక్షించారు. రంజాన్‌ పండగ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కరోనా అంతాని కోసం ముస్లిం సోద రులు అల్లాను ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే ప్రార్థనలు చేసి ఆనందంగా గడపాలని కోరారు. 

మాజీ వైస్‌ ఛాన్సలర్‌ సేవలు ఎనలేనివి

తెలంగాణ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ పి.సాంబయ్య విద్యారంగ అభివృద్ధికి ఎనలేని సేవ చేశారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కొనియాడారు. సాంబయ్య మృతి చెందడం దిగ్ర్భాంతి కలిగించిందని గురు వారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తనదయిన శైలిలో బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దారని అన్నారు. సాంబయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


Updated Date - 2021-05-14T06:27:01+05:30 IST