అంతరిక్షానికి భగవద్గీత, మోదీ ఫొటో!
ABN , First Publish Date - 2021-02-15T16:56:54+05:30 IST
త్వరలో ఎస్డీ శాట్ అనే ప్రైవేట్ శాటిలైట్ ప్రధాని నరేంద్ర మోదీ...
న్యూఢిల్లీ: త్వరలో ఎస్డీ శాట్ అనే ప్రైవేట్ శాటిలైట్ ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతోపాటు ఒక భగవద్గీత కాపీని, 25 వేల మంది పేర్లను అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ) ద్వారా ఈ ఎస్డీ శాట్ శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపించనున్నారు. స్పేస్కిడ్జ్ ఇండియా ఈ శాటిలైట్ను అభివృద్ధి చేసింది. స్పేస్కిడ్జ్ ఇండియా విద్యార్థుల్లో స్పేస్ సైన్స్ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుంటుంది. ఈ శాటిలైట్ అదనంగా మరో మూడు పేలోడ్స్ను కూడా తనతోపాటు తీసుకు వెళ్లనుంది.
ఈ సందర్భంగా స్పేస్కిడ్జ్ ఇండియా సీఈవో డాక్టర్ కేశన్ మాట్లాడుతూ తమ శాటిలైట్ నింగిలోకి దూసుకు వెళ్లే క్షణాల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామన్నారు. స్పేస్లోకి వెళ్తున్న తమ తొలి శాటిలైట్ ఇదేనని, ఈ మిషన్ను అభివృద్ధి చేస్తున్నప్పుడు పేర్లు పంపించాల్సిందిగా ప్రజలను కోరామని, దీంతో వారంలోనే 25 వేల మంది పేర్లు వచ్చాయన్నారు. ఈ పేర్లతోపాటు ప్రధాని మోదీ ఫొటోను, ఒక భగవద్గీత కాపీని కూడా పంపుతామని తెలిపారు. ఈ శాటిలైట్లో పంపే పేర్లలో ఇస్రో చైర్పర్సన్ కే శివన్, సైంటిఫిక్ సెక్రటరీ ఉమామహేశ్వరమ్ పేర్లు కూడా ఉన్నాయని కేశన్ తెలిపారు.