నయా మోసం: మీ దగ్గర ఇలాంటి వాహనం ఉందా.. అయితే జాగ్రత్త.. లేదంటే అంతే సంగతులు!
ABN , First Publish Date - 2021-09-29T17:11:28+05:30 IST
మీ దగ్గర..
భరత్పూర్(రాజస్థాన్): మీ దగ్గర ఎకో వ్యాన్ ఉందా..? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే..! లేదంటే నష్టపోతారు. ఎందుకంటే ప్రస్తుతం ఓ కొత్త దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఎకో వ్యాన్ సైలెన్సర్లే వారి టార్గెట్. సైలెన్సర్లు దొంగలించడం ద్వారా భారీగానే లాభాలు ఆర్జిస్తున్నారు. అదెలాగో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే..
ఎకో వ్యాన్ సైలెన్సర్ తయారీలో దాదాపుగా 400గ్రాముల వరకు సిల్వర్ను వాడుతారు. కాలుష్యం తగ్గించడం కోసం ఎకో వ్యాన్ సైలెన్సర్లో సిల్వర్ ఫిల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క సైలెన్సర్ ధర దాదాపుగా రూ.75వేల వరకు ఉంటుంది. అందువల్ల దొంగలు ఈ రూట్ ఎంచుకున్నారు. మథురా గేట్ పోలీసులు బ్రిజ్ బిహర్ కాలనీకి చెందిన సుస్పేంద్ర కుమార్ జాట్ అనే దొంగను విచారిస్తుండగా ఈ దొంగతనం గురించి వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ రామ్వీర్ సింగ్ మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు.
బరాకుర్కు చెందిన దేవేంద్ర సింగ్, భోసింగకు చెందిన రాము తనకు దొంగతనంలో సహాయం చేసేవారని సుస్పేంద్ర కుమార్ అంగీకరించాడని ఏఎస్ఐ తెలిపారు. సైలెన్సర్లను దొంగతనం చేసి వాటినుంచి సిల్వర్ ఫిల్టర్లను వేరు చేసి మార్కెట్లో విక్రయించేవారన్నారు. ఫిల్టర్లను అమ్మి దాదాపుగా 35వేల నుంచి 40వేల వరకు సంపాదించేవారన్నారు. అలాగే ఫిల్టర్లు తీసేసిన సైలెన్సర్ అమ్మేసిన రూ.5వేలు వస్తాయని వాళ్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని రామ్వీర్ సింగ్ వివరించారు.
సుస్పేంద్ర కుమార్కు ఎకో వాహనం ఉండేది. అప్పడే ఆయనకు ఈ సిల్వర్ ఫిల్టర్ల గురించి తెలిసింది. దీంతో అప్పటినుంచి ఆయన ఈ నయామోసానికి పాల్పడుతూ వచ్చాడు. గత 6నెలల్లో 50 ఎకో వాహనాల సైలెన్సర్లు దొంగలించారని పోలీసులు తెలపారు. సోమవారం ఫతేపూర్ సిక్రి వెళ్లడం కోసం ఈ ముగ్గురు దొంగలు రూ.900లకు ఒక ఎకో వ్యాన్ను బుక్ చేసుకున్నారు. కొంత దూరం వెళ్లాకా ఓ వ్యక్తి లగేజ్ తెచ్చుకోవాలని అటవీ ప్రాంతంలో వ్యాన్ను ఆపించాడరు. ఆ తర్వాత మిగతా ఇద్దరు కూడా కిందకు దిగి సైలెన్సర్ దొంగతనం చేయడం మొదలుపెట్టారు. డ్రైవర్ అడ్డుపడగా అతనిని కొట్టి పారిపోయారు. ఈ కేసు సందర్భంగానే పోలీసులకు ఈ నయా మోసం గురించి తెలిసింది.