న్యూజిల్యాండ్‌లో 102 రోజుల తర్వాత కొత్తగా నాలుగు కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-12T23:04:32+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం సాధించని ఘనతను న్యూజిల్యాండ్ సాధించిన విషయం తెలిసిందే

న్యూజిల్యాండ్‌లో 102 రోజుల తర్వాత కొత్తగా నాలుగు కరోనా కేసులు

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం సాధించని ఘనతను న్యూజిల్యాండ్ సాధించిన విషయం తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 102 రోజుల పాటు న్యూజిల్యాండ్‌లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే 102 రోజుల తర్వాత ఒక కరోనా కేసు నమోదైనట్టు మంగళవారం ఓ వార్త వచ్చింది. జూలై 30న ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి కరోనా బారిన పడినట్టు అధికారులు తెలిపారు. అయితే తాజాగా న్యూజిల్యాండ్‌లో మరో నాలుగు కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 50ల వయసులో ఉన్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అతడికి కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు జరపగా.. మరో ముగ్గురికి పాజిటివ్ అని తేలినట్టు అధికారులు తెలిపారు. ఈ నాలుగు కేసులు కూడా ఆక్లాండ్ నుంచి నమోదైనట్టు తెలుస్తోంది. ఇక దేశంలో మళ్లీ కరోనా కేసులు బయటపడుతుండటంతో ఆక్లాండ్‌లో మళ్లీ ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రధాని జకిందా ఆర్డర్న్ తెలిపారు. కొద్ది రోజుల పాటు మిగతా ప్రాంతాల నుంచి ఆక్లాండ్‌లోకి ఎవరూ రాకుండా నిషేధం విధిస్తున్నామన్నారు. బుధవారం రాత్రి నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు తమకు కరోనా రాకపోయినా వచ్చినట్టే భావించి అందుకు తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలని జకిందా ఆర్డర్న్ కోరారు.  ఇక ప్రజలు అత్యవసర పనులకు బయటకు వచ్చే సమయంలో తప్పక ఫేస్‌మాస్క్ ధరించాలంటూ ప్రభుత్వం కోరింది. భౌతిక దూరం పాటించడం కష్టం అనుకున్న ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. కాగా.. న్యూజిల్యాండ్‌లో కొత్తగా కేసులు బయటపడటం ఆశ్చర్యంగా ఉందని దేశ హెల్త్ డైరెక్టర్ జనరల్ యాష్లే బ్లూమ్‌ఫీల్డ్ అన్నారు. ఇంతకుముందు కరోనాను అదుపు చేశామని.. ఇప్పుడు కూడా అదుపు చేయగలమన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు. 


Updated Date - 2020-08-12T23:04:32+05:30 IST