ఇప్పుడొచ్చే కోవిడ్ సునామీనే: ఉద్ధవ్ థాకరే

ABN , First Publish Date - 2020-11-23T02:57:28+05:30 IST

అయితే ఒక్క విషయంలో నేను అసంతృప్తితో ఉన్నాను. దీపావళి తర్వాత మళ్లీ జనసంచారం రద్దీ అవుతుందని నేను ముందుగానే చెప్పాను. కోవిడ్ అయిపోయిందని అసలు అనుకోవద్దు. ఇప్పటికీ చాలా మంది మాస్కులు పెట్టుకోవట్లేదు. నిర్లక్ష్యంగా అస్సలు ఉండవద్దు

ఇప్పుడొచ్చే కోవిడ్ సునామీనే: ఉద్ధవ్ థాకరే

ముంబై: కోవిడ్-19 రెండవ దశ ప్రారంభమైతే దాని ప్రభావం సునామీని తలపించొచ్చని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ ప్రభావంపై ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘‘మనం గతంలో వినాయక చవితి, దసరా, దీపావళి లాంటి అనేక పండుగలు ప్రమాదంతోనే చేసుకున్నాం. అయితే రాష్ట్ర ప్రజలు కోవిడ్ నియమాళను పాటిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చారు. అందుకే కోవిడ్‌ను అదుపులో ఉంచగలిగాం’’ అని ఉద్ధవ్ అన్నారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘అయితే ఒక్క విషయంలో నేను అసంతృప్తితో ఉన్నాను. దీపావళి తర్వాత మళ్లీ జనసంచారం రద్దీ అవుతుందని నేను ముందుగానే చెప్పాను. కోవిడ్ అయిపోయిందని అసలు అనుకోవద్దు. ఇప్పటికీ చాలా మంది మాస్కులు పెట్టుకోవట్లేదు. నిర్లక్ష్యంగా అస్సలు ఉండవద్దు. పశ్చిమ దేశాలను చూడండి. రెండవ, మూడవ దశల్లో ఉన్నాయి. ఇక్కడ కూడా అలాంటిది ప్రారంభమవ్వొచ్చు. అదే వస్తే సునామీని తలపిస్తుందేమో. మహారాష్ట్రలో 12 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇంత మందిని ప్రభుత్వం అదుపు చేయలేదు. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి’’ అని అన్నారు.

Updated Date - 2020-11-23T02:57:28+05:30 IST