ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరంపై ఎన్జీటీ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-06-04T00:24:45+05:30 IST

ఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. లిఖితపూర్వక ఆదేశాలను...

ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరంపై ఎన్జీటీ ఆగ్రహం

న్యూఢిల్లీ: ఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. లిఖితపూర్వక ఆదేశాలను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వెలువరించింది. కలెక్టర్ వద్ద ఉంచిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు, బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఒకొక్కరు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ కలెక్టర్ సహా మరో ఇద్దరితో పర్యావరణ పునరుద్ధరణ ప్రణాళికా కమిటీ ఏర్పాటు చేయాలని ఎన్జీటీ సూచించింది. రెండు నెలల్లో కమిటీ పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వాలని, కేంద్ర పర్యావరణశాఖ ఈ కమిటీకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని ఎన్జీటీ ఆదేశించింది. పరిహారం ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించడానికి మరో కమిటీని ఏర్పాటు చేయాలని.. ఈ కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, నీరి సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉండాలని ఎన్జీటీ స్పష్టం చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి రెండు వారాల్లో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని, రెండు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ ఆదేశించింది. 


అనుమతులు లేకుండా సంస్థ నడవడం ద్వారా చట్టాలు వైఫల్యం చెందడానికి కారణమైన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తీసుకున్న చర్యలతో రెండు నెలల్లో ఎన్జీటీకి నివేదిక సమర్పించాలని, ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా కంపెనీ తిరిగి ప్రారంభించొద్దని ఎన్జీటీ స్పష్టం చేసింది. చట్టబద్ధమైన అనుమతులు వచ్చాక ఎన్జీటీయే అనుమతి ఇస్తుందని, రసాయనాలతో కూడిన ప్లాంట్లలో పర్యావరణ నిబంధనలు తనిఖీ చేయడానికి నిరోధించడానికి కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ కమిటీ తనిఖీలు చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.


సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందని స్పష్టం చేసింది. పర్యావరణానికి హాని కలిగేలా పరిస్థితులు సంభవించినప్పుడు ఎన్జీటీ చేతులు కట్టుకొని కూర్చోదని ఘాటు వ్యాఖ్య చేయడం గమనార్హం. విచక్షణాధికారాలకు లోబడే సుమోటోగా కేసు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు, ఇతర ఫోరాలు వేసిన కమిటీలు చేసే విచారణల్లో ఎలాంటి విభేదం ఉండదన్న ఎన్జీటీ, ఏ కమిటీ విచారణ అదే చేస్తుందని తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ఎన్జీటీ తీర్పులను ఇస్తుందన్న ధర్మాసనం.. తదుపరి విచారణను నవంబర్ 3కి వాయిదా వేసింది.

Updated Date - 2020-06-04T00:24:45+05:30 IST