డీఎస్పీ కేసు.. కశ్మీర్లో ఎన్ఐఏ దాడులు
ABN , First Publish Date - 2020-02-02T18:16:35+05:30 IST
ఉగ్రవాదులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఇటీవల పట్టుబడిన జమ్మూకశ్మీర్ డీఎస్పీ దేవీందర్ సింగ్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆదివారంనాడు కశ్మీర్లోని ..
ఉగ్రవాదులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఇటీవల పట్టుబడిన జమ్మూకశ్మీర్ డీఎస్పీ దేవీందర్ సింగ్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆదివారంనాడు కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దక్షిణ కశ్మీర్లోని పలు ప్రైవేటు కార్యాలాయాలు, నివాసాల్లో ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించినట్టు ఆ వర్గాలు తెలిపాయి.
జనవరి 11న ఖాజీగండ్లోని మీర్ బజార్ వద్ద హిజ్బుల్ ముజాయిద్దీన్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులతో కారులో ప్రయాణిస్తుండగా డీఎస్పీ దేవీందర్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను సస్పెండ్ చేయడంతో పాటు కేసును ఎన్ఐఏకు అప్పగించారు. దక్షిణ కశ్మీర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అతుల్ గోయల్ నేతృత్వంలోని పోలీస్ బృందం వీరిని అరెస్ట్ చేసింది. పట్టుబడ్డ ఉగ్రవాదులను నవీద్ బాబు, అసిఫ్ రథేర్గా గుర్తించారు. ఇరువురూ సోఫియాన్కు చెందినవారు కాగా, వీరి వద్ద నుంచి రెండు ఏకే 47 తుపాకులు, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులను ఎన్ఐఏ ఇంటరాగేట్ చేస్తోంది. ఉగ్రనిధుల కోణం నుంచి ఎన్ఐఏ తాజా దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది.