మూడు నగరాల్లో నేటినుంచి నైట్ కర్ఫ్యూ
ABN , First Publish Date - 2021-04-08T13:35:29+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లక్నో, వరణాసి, కాన్పూర్ నగరాల్లో...
పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి కోసం...
లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లక్నో, వరణాసి, కాన్పూర్ నగరాల్లో గురువారం నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తూ యూపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా దీని కట్టడి కోసం గురువారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్ల్లు లక్నో పోలీసు కమిషనర్ డీకే ఠాకూర్ చెప్పారు.నైట్ కర్ఫ్యూ ఉత్తర్వులు ఈ నెల 30వతేదీ వరకు అమలులో ఉంటాయని కమిషనర్ పేర్కొన్నారు.
లక్నో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ సంస్థలను మూసివేస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యకళాశాలలు, నర్సింగ్, పారామెడికల్ సంస్థలను ఏప్రిల్ 15వతేదీ వరకు మూసివేశారు.కాన్పూర్ లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఏప్రిల్ 30 దాకా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ ప్రకటించారు.వరణాసి నగరంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు వరణాసి పోలీసు కమిషనర్ వెల్లడించారు.