అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల కలకలం..!
ABN , First Publish Date - 2021-05-14T16:26:22+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. రోడ్ ఐలాండ్ రాష్ట్ర రాజధాని ప్రొవిడెన్స్లో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది గాయపడ్డారు.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. రోడ్ ఐలాండ్ రాష్ట్ర రాజధాని ప్రొవిడెన్స్లో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి 7 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) వాషింగ్టన్ పార్క్ వద్ద ఈ కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్లు ప్రొవిడెన్స్ పోలీస్ చీఫ్ కల్నల్ హ్యూ టి. క్లెమెంట్స్ చెప్పారు. స్థానికంగా ఉన్న ఓ ఇంటిపై తొలుత దుండుగులు కారులోంచి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. దాంతో వారిని ప్రతిఘటించే క్రమంలో ఆ ఇంట్లోని వారు సైతం తిరిగి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఇలా రెండు బృందాల మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగినట్లు వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన వారిని విచారిస్తున్నామని, ఇప్పటివరకూ ఎలాంటి అరెస్టులు జరగలేదని పోలీస్ అధికారి క్లెమెంట్స్ వివరించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను త్వరలోనే గుర్తించి అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.