కరాచీ విమాన ప్రమాదంలో 92కు పెరిగిన మృతుల సంఖ్య
ABN , First Publish Date - 2020-05-23T13:07:11+05:30 IST
కరాచీ విమానాశ్రయం సమీపంలో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ)కి చెందిన ఏ-320 విమానం (పీకే-8303) కుప్పకూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 92కు పెరిగింది....
ఇద్దరు ప్రయాణికులు సురక్షితం
ఇస్లామాబాద్ (పాకిస్థాన్): కరాచీ విమానాశ్రయం సమీపంలో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ)కి చెందిన ఏ-320 విమానం (పీకే-8303) కుప్పకూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 92కు పెరిగింది. ఈ విమాన ప్రమాదం నుంచి ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా గాయాలతో బయటపడ్డారని పాకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మీరన్ యూసుఫ్ చెప్పారు. 60 మృతదేహాలను జిన్నా పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ సెంటరులో, మరో 32 మృతదేహాలను కరాచీ సివిల్ ఆసుపత్రిలో భద్రపర్చామని యూసుఫ్ చెప్పారు.
కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మలీర్ వద్ద గల మోడల్ కాలనీలో ఈ విమానం కూలింది. ప్రమాదానికి గురైన విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది విమాన సిబ్బంది ఉన్నారు. విమాన ప్రమాదం జరిగిన వెంటనే సింధ్ ఆరోగ్య, జనాభా సంక్షేమశాఖ మంత్రి కరాచీలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ విమాన ప్రమాదంపై పాకిస్థాన్ పౌరవిమానయానశాఖ విభాగం నలుగురు సభ్యుల కమిటీ దర్యాప్తు చేయనుంది. ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు జరిపే కమిటీలో ఎయిర్ కమాండర్ ఉస్మాన్ ఘనీ, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు అధ్యక్షుడు సభ్యులుగా ఉంటారని పాక్ తెలిపింది.