ఆర్థిక సాయానికి నిరీక్షణ

ABN , First Publish Date - 2020-11-23T06:22:14+05:30 IST

లాక్‌డౌన్‌ వల్ల పనులు లేక ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ రంగం కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ నీటిమూటగా మారింది.

ఆర్థిక సాయానికి నిరీక్షణ

లాక్‌డౌన్‌తో నెలల తరబడి ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు

కార్మిక సంక్షేమ నిధి నుంచి సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

జిల్లాలో సుమారు లక్ష మంది భవన నిర్మాణ కార్మికులు

ఆధార్‌, బ్యాంకు వివరాలతో 45 వేల మంది దరఖాస్తు 

నెలలు గడుస్తున్నా ఒక రూపాయి కూడా అందని వైనం

పైగా సంక్షేమ నిధులను దారిమళ్లిస్తున్నదని కార్మికుల ఆవేదన


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం) 

లాక్‌డౌన్‌ వల్ల పనులు లేక ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ రంగం కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ నీటిమూటగా మారింది. కార్మిక సంక్షేమ నిధి నుంచి సాయం అందిస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. తాము దాచుకున్న మొత్తంలో నుంచి కొంత ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తున్నదో అర్థం కావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వల్ల లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులు పనుల్లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొన్ని నెలలపాటు పనుల్లేక ఆర్థికంగా కుదేలైపోయారు. చాలా మంది కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కార్మికులకు ఆర్థిక సాయం చేయాలన్న డిమాండ్‌ సర్వత్రా వినిపించడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో పనుల్లేక ఇబ్బందులు పడిన భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తామని, ఇందుకు ఆధార్‌ నంబర్‌, బ్యాంకు ఖాతా వివరాలు అందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మే 29వ తేదీన కార్మిక సంక్షేమ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో సుమారు లక్ష మంది వరకు భవన నిర్మాణ కార్మికులు వున్నారు. అయితే ప్రభుత్వ నిధులు కాకుండా, తాము పొదుపు చేసుకున్న కార్మిక సంక్షేమ నిధి నుంచి సాయం ఇవ్వడంపై చాలా మంది కార్మికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పైపెచ్చు కార్మికుల వివరాలను నమోదు చేయాల్సిన కార్మిక శాఖ... సిబ్బంది కొరత, కరోనా వైరస్‌ పేరుతో పక్కకు తప్పుకుంది. దీంతో భవన నిర్మాణ కార్మికులు ఒకటి రెండు రోజులు పనులు మానుకుని, ఇంటర్నెట్‌ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయించుకున్నారు. జిల్లాలో లక్ష మంది వరకు భవన నిర్మాణ కార్మికులు వుండగా,  సుమారు 45 వేల మంది మాత్రమే సాయం కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఇది జరిగి మూడు నాలుగు అయినప్పటికీ ఇంతవరకు ఒక్క కార్మికుడికి కూడా డబ్బులు అందలేదు.


కార్మికుల డబ్బులే... అయినా జాప్యం ఎందుకో!

భవన నిర్మాణ రంగ కార్మికులు ఐదేళ్లకోసారి నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్‌ బోర్డుకు రూ.110 చొప్పున చెల్లిస్తారు. అదే విధంగా కార్మికులు పనిచేసే భవనాలు, నిర్మాణ కంపెనీల యజమానులు సెస్‌ కింద మరికొంత చెల్లిస్తారు. ఈ మొత్తం కార్మికుల వెల్ఫేర్‌ బోర్డులో జమ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా విపత్తు సాయంగా అందించాలనుకున్న సొమ్మును రాష్ట్ర ఖజానా నుంచి కాకుండా,  కార్మిక సంక్షేమ నిధి చెల్లిస్తామని చెప్పింది. అయినప్పటికీ తీవ్రజాప్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా కార్మికుల సంక్షేమ నిధిలోని డబ్బులను ఇతర కార్యక్రమాలకు మళ్లించి తమకు ద్రోహం చేస్తున్నారని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు.  దేశంలోని పలు రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకు ఆయా ప్రభుత్వాలు సాయం అందించాయని, కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వం సాయం చేయకపోగా, కనీసం కార్మిక సంక్షేమ నిధి నుంచి కూడా ఇవ్వడంలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-11-23T06:22:14+05:30 IST