ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2021-12-08T20:23:31+05:30 IST

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తిమంతులైన

ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాలో వరుసగా మూడోసారి స్థానం దక్కించుకున్నారు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఆమె మరింత మెరుగైన స్థానంలో నిలవడం విశేషం. గత ఏడాది ఆమె ఈ జాబితాలో 41వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 37వ స్థానాన్ని దక్కించుకున్నారు. అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ కన్నా రెండు స్థానాలు ముందంజలో ఉండటం మరో విశేషం. 


మన దేశ తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించిన నిర్మల సీతారామన్ ఈ జాబితాలో 2019లో 34వ స్థానంలోనూ, 2020లో 41వ స్థానంలోనూ, 2021లో 37వ స్థానంలోనూ నిలిచారు. 


అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రతి సంవత్సరం ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో 40 మంది సీఈఓలు ఉన్నారు. వీరు 3.3 ట్రిలియన్ల డాలర్ల రెవిన్యూను పర్యవేక్షిస్తున్నట్లు ఈ పత్రిక తెలిపింది. ప్రపంచంలో 19 మంది మహిళా నేతలు, ఓ ఇమ్యునాలజిస్ట్ కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. దాత‌‌‌ృత్వంగల మహిళ మెకెంజీ స్కాట్ ఈ జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్ రెండో స్థానాన్ని, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్డే మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. 


ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల్లో హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ రోషిణి నాడార్ మల్హోత్రా, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా, నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్  ఉన్నారు. 


బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా కూడా ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల్లో ఒకరుగా ఈ జాబితాలో గుర్తింపు పొందారు. 


Updated Date - 2021-12-08T20:23:31+05:30 IST