బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించడంపై నిర్మల సీతారామన్ ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2021-11-29T21:45:55+05:30 IST

దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన

బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించడంపై నిర్మల సీతారామన్ ఏమన్నారంటే...

న్యూఢిల్లీ : దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. బిట్‌కాయిన్ లావాదేవీలపై సమాచారాన్ని ప్రభుత్వం సేకరించడం లేదన్నారు. సోమవారం లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ స్పష్టత ఇచ్చారు. 


బిట్‌కాయిన్ అనేది డిజిటల్ కరెన్సీ. బ్యాంకులు, క్రెడిట్ కార్డులను జారీ చేసే సంస్థలు లేదా ఇతరుల ప్రమేయం లేకుండా వస్తువుల కొనుగోలు, సేవల కొనుగోలు, ధన మార్పిడికి దీనిని ఉపయోగించవచ్చు. దీనిని 2008లో గుర్తు తెలియని ప్రోగ్రామర్ల బృందం ప్రారంభించింది. 


ఇదిలావుండగా, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్వారా అధికారికంగా డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తేవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు కొన్ని ప్రైవేటు క్రిప్టోకరెన్సీలు మినహా మిగిలిన క్రిప్టోకరెన్సీలను నిషేధిస్తూ ఓ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతోంది. క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫిషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని ప్రతిపాదించనుంది. 


Updated Date - 2021-11-29T21:45:55+05:30 IST