ఈ సంస్కరణలతో రానున్న దశాబ్దంలో వృద్ధి వేగవంతం : నీతీ ఆయోగ్ సీఈవో
ABN , First Publish Date - 2021-03-26T01:58:57+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న సంస్కరణలు రానున్న దశాబ్దంలో సత్ఫలితాలిస్తాయని నీతీ ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఎంతో కాలంగా కోరుకుంటున్న సంస్కరణలను ఈ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్, 2021లో గురువారం ఆయన మాట్లాడారు.
ప్రతి సంవత్సరం ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వృద్ధి చెందడం భారత దేశం ముందు ఉన్న నిజమైన సవాలు అని అమితాబ్ కాంత్ చెప్పారు. 1991లో భారీ సంస్కరణలు జరిగాయని, ఆ తర్వాత అంతగా సంస్కరణలు జరగలేదని అన్నారు. అయితే కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఎంతో కాలంగా కోరుతున్న స్ట్రక్చరల్ రిఫార్మ్స్ జరిగాయని చెప్పారు. గనులు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు వంటి రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల ఆర్ధికాభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
ఎంతో కాలంగా కోరుతున్న సంస్కరణలను కోవిడ్ మహమ్మారి తర్వాత అమల్లోకి తీసుకొచ్చారని, ఆర్థిక వ్యవస్థ కోలుకునే తీరు ఆంగ్ల అక్షరం ‘వీ’ రూపంలో ఉందని చెప్పారు. రానున్న దశాబ్దంలో వృద్ధి కనిపిస్తుందని చెప్పారు. ఇటీవలి సంస్కరణలు కేవలం వచ్చే ఏడాదిలో మాత్రమే కాకుండా రానున్న దశాబ్దంలో వృద్ధి వేగాన్ని పెంచుతాయని చెప్పారు.