కోవిడ్ పట్ల ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి : వీకే పాల్

ABN , First Publish Date - 2021-07-24T00:27:12+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి విషయంలో మరో మూడు నెలలు

కోవిడ్ పట్ల ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి : వీకే పాల్

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి విషయంలో మరో మూడు నెలలు చాలా ముఖ్యమైనవని, ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని నీతీ ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. ఆంక్షలను సడలిస్తూ, అన్‌లాక్ చేయడం వల్ల కోవిడ్ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు. ఢిల్లీలో ప్రయాణాలపై ఆంక్షలు విధించడానికి ముందు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సిఫారసు చేశారు. ప్రస్తుతం కోవిడ్-19 పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ, అన్‌లాక్ కార్యకలాపాలు కేసులు పెరగడానికి దారితీస్తాయన్నారు. 


ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీతో జూలై 9న జరిగిన సమావేశం వివరాలు ఇటీవల వెల్లడైనట్లు జాతీయ మీడియా శుక్రవారం తెలిపింది. ఈ సమావేశంలో నీతీ ఆయోగ్ (హెల్త్) సభ్యుడు వీకే పాల్ ఈ సిఫారసులు చేసినట్లు తెలిపింది. కరోనా వైరస్ మూడో ప్రభంజనం కమ్ముకొచ్చే అవకాశాలు ఉన్నాయని, రాబోయే మూడు నెలల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని వీకే పాల్ చెప్పారని తెలిపింది. 


మరోవైపు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కు చెందిన డాక్టర్ సమరియన్ పాండా మాట్లాడుతూ, కోవిడ్-19 సెకండ్ వేవ్ చూపిన స్థాయిలో థర్డ్ వేవ్ ప్రభావం ఉండబోదని చెప్పారు. మానవులకు సంక్రమించే సామర్థ్యం మరింత ఎక్కువగా ఉండే కరోనా వైరస్‌కు సంబంధించిన ఏదైనా కొత్త వేరియంట్ వస్తే, తగిన స్థాయిలో లాక్‌డౌన్ చర్యలు లేకపోవడం వల్ల అంతకుముందు ఉన్న రోగ నిరోధక శక్తిని అధిగమించగలిగితే  మూడో ప్రభంజనం వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. 


Updated Date - 2021-07-24T00:27:12+05:30 IST