తేజస్వి హామీలన్నీ మాయ మాటలే : నితీశ్ కుమార్

ABN , First Publish Date - 2020-10-30T21:10:59+05:30 IST

బిహార్ శాసన సభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది.

తేజస్వి హామీలన్నీ మాయ మాటలే : నితీశ్ కుమార్

పాట్నా : బిహార్ శాసన సభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. రెండో దశ పోలింగ్ సమీపిస్తుండటంతో పార్టీల అగ్ర నేతలు గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిరుద్యోగులు, రైతులు, తదితర వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థుల హామీలు ఉత్తుత్తి మాటలేనని, తాము ఆచరణ సాధ్యమైన హామీలనే ఇస్తున్నామని చెప్తున్నారు. 


బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం పర్బట్టలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ తేజస్వి చెప్తున్న మాటలన్నీ బూటకమని దుయ్యబట్టారు. ఓటర్లను గందరగోళంలో పడేయడానికి, తప్పుదోవ పట్టించడానికి ఇటువంటి హామీలు ఇస్తున్నారని వివరించారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్తూనే ఉంటారని, వాళ్ళు ఏదైనా చెబుతారని, ఆ మాటలన్నీ బోగస్ అని చెప్పారు. 


ఇదిలావుండగా, బీజేపీ కూడా ఇటువంటి హామీనే ఇచ్చింది. బిహార్ నిరుద్యోగులకు 15 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన అష్ట దిగ్బంధనం వల్ల ప్రజలు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామనే హామీలను ప్రజలు విశ్వసిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో నితీశ్ కుమార్ మాటలు జేడీయూ కూటమి విజయావకాశాలపై ఎటువంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. 


Updated Date - 2020-10-30T21:10:59+05:30 IST