‘నివర్‌’గప్పిన మబ్బులు..

ABN , First Publish Date - 2020-11-26T05:29:30+05:30 IST

అన్నదాతలకు నివర్‌ తుఫాన్‌ భయం వెంటాడుతోంది. తుఫాన్‌ ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో కలవర పడుతున్నారు. రెండు రోజులుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. దీనికి తోడు చలిగాలులు పెరిగాయి. దిగుబడులు చేతికొచ్చే సమయంలో నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురుస్తాయోమోననే దిగులు రైతులను వెంటాడుతోంది.

‘నివర్‌’గప్పిన మబ్బులు..
కల్లాలకు వరిచేను తీసుకెళ్తున్న రైతులు

అన్నదాతలను వణికిస్తున్న తుఫాన్‌ భయం

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/టెక్కలి/నందిగాం)

అన్నదాతలకు నివర్‌ తుఫాన్‌ భయం వెంటాడుతోంది. తుఫాన్‌ ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో కలవర  పడుతున్నారు. రెండు రోజులుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. దీనికి తోడు చలిగాలులు పెరిగాయి. దిగుబడులు చేతికొచ్చే సమయంలో నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురుస్తాయోమోననే దిగులు రైతులను వెంటాడుతోంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 2.08 లక్షల హెక్టార్లలో వరి సాగు చేసారు. అధికారిక అంచనాల ప్రకారం ఇప్పటికే లక్షకు పైగా హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. నూర్పులకు సిద్ధమవుతున్న సమయంలో వర్షం కురిస్తే, తమ పరిస్థితి ఏంటని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు వరికోతలు మధ్యలో ఆపేసి.. ఇప్పటికే కోసిన పనలను కుప్పలుగా వేసి భద్రం చేస్తున్నారు. వరిచేనును కుప్పలు పెట్టడంతో పాటు కల్లాలకు మోసే పనిలో నిమగ్నమయ్యారు. ఇంకొందరు నూర్చిన ధాన్యాన్ని సైతం టార్పాలిన్లు కప్పి జాగ్రత్తలు చేసుకున్నారు. మరోవైపు వరి కోతలకు సిద్ధమవుతున్న రైతులకు కూలీలు దొరకడం లేదు. ఎకరా వరి కోత పూర్తి చేయడానికి రైతులు సుమారు రూ.4వేలకుపైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కోత యంత్రాలను అందుబాటులోకి తెస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెప్పినా... ఎక్కడా వాటి జాడ లేదు. దీంతో రైతులు కోత, నూర్పు పనులకు కూలీలపైనే ఆధారపడుతున్నారు. కానీ లాక్‌డౌన్‌ సడలింపులు అనంతరంగా చాలామంది ఉపాధి కోసం మళ్లీ వలస పోవడంతో.. కూలీల కొరత వెంటాడుతోంది. దీంతో కూలీలకు డిమాండ్‌ పెరిగి.. తమపై అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

 

Updated Date - 2020-11-26T05:29:30+05:30 IST