గుడి, విగ్రహం, ప్రదక్షిణలో పరమార్థం..!

ABN , First Publish Date - 2020-07-19T08:21:49+05:30 IST

గుడి అంటే పవిత్ర, స్వచ్ఛ, శాంతిమయ వాతావరణం ఉండే స్థలం. హిందువుల దేవాలయాలు కేవలం ప్రార్థన మందిరాలే కాక మానవాతీతమైన దివ్యశక్తులు ఉన్న ప్రదేశాలు. శరీరానికి ఆత్మ

గుడి, విగ్రహం, ప్రదక్షిణలో పరమార్థం..!

గుడి అంటే పవిత్ర, స్వచ్ఛ, శాంతిమయ వాతావరణం ఉండే స్థలం. హిందువుల దేవాలయాలు కేవలం ప్రార్థన మందిరాలే కాక మానవాతీతమైన దివ్యశక్తులు ఉన్న ప్రదేశాలు. శరీరానికి ఆత్మ ఎలాంటిదో ఊరికి దేవాలయం అటువంటిది. గుడిలో మంత్ర, తంత్ర, ఆగమ విధానాలతో, యజ్ఞాది వైదిక కర్మకాండతో ప్రతిష్టింపబడే భగవత్‌ మూర్తి కేవలం విగ్రహం కాదు..! ఆ ధృవచేరం(విరాట్‌మూర్తి) దైవంగా భావించబడి దివ్యశక్తులను సంతరించుకుంటుది. ఆ మూర్తి నుంచి అదృశ్య దివ్యతరంగాలు నలువైపులా విరజిమ్మబడుతూ ఉంటాయి. ఫలితంగా గుడిలోని ప్రతి భాగమూ దివ్యత్వాన్ని సంతరించుకుని, భక్తులకు మాటలకందని ప్రశాంతతను, ఊరటను, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందజేస్తాయి. గుడిని నిర్మించిన దాతల ఔదార్యం, భక్తి భావం, ఆధ్యాత్మిక ఆలోచన, వదాన్యత.. ఇలా అన్నీ కలిసి ఆ గుడికి మరింత శక్తిని, మహిమను, వైభవాన్ని కలిగిస్తాయి. గుడి నిర్మాణం వెనుక ప్రధాన లక్ష్యం పంచభూతాలు కూడ(నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి) అక్కడ మనకు దర్శనమిస్తాయి. అర్చనలు, ఆరాధనలు, పారాయణలు, హోమాలు. ప్రార్థనలు, ప్రవచనాలు. ఉత్సవాలు వంటివి ఆయా దేవాలయాలకు మరింత ప్రాభవాన్ని కలిగిస్తాయి. 


వీటితోపాటు.. అక్కడ జియోపథిక్‌ స్ట్రెస్‌ను తొలగించే పాజిటివ్‌ ఎనర్జీ పుష్కలంగా ఉంటుంది. చిదంబరంలోని విగ్రహం, తిరుమల శ్రీనివాసుని విరాట్‌ మూర్తి ఉన్న ప్రదేశాల్లో  భూమ్యాకర్షణ శక్తి ఉన్నదని చెబుతుంటారు. విశ్వరచనను, మన దేహ రచనను చక్కగా రచించడమే కాక, వాస్తును కూడా కచ్చితంగా పాటించి ప్రతిష్టింపచేయడం వల్లనే ఆ దివ్య మంగళ విగ్రహం దైవత్వాన్ని సంతరించుకుంటుంది. అక్కడి శంఖారావాలు, ఘంటారావాలు. దీపాల కాంతులు, పుష్పాల దివ్య పరిమళాలు, ధూప, దీపాలు, మంత్రాలు, ప్రవచనాలు మనలో ఆధ్యాత్మికతను, ఆస్తికతను పెంపొందిస్తాయి. దైవంపై విశ్వాసాన్ని ఇనుమడింపచేస్తాయి. అలాగే గర్భాలయం చుట్టూ, భగవన్నామస్మరణతో, ఏకాగ్రతతో, నెమ్మదిగా కదులుతూ చేసే ప్రదక్షిణలు కూడా ఎంతో ప్రభావతంమైనవని ఫలదాయకమైనవని పెద్దలు చెబుతుంటారు. దేవాలయంలోని దైవాన్ని బట్టి కూడా ప్రదక్షిణాల సంఖ్య ఉంటుంది. బజారులో కొనో, ఇంట్లో తయారు చేసో తెచ్చే పదార్థాన్ని దైవం కొంత స్వీకరించి, దయతో మనకు తిరిగి అందించేదే ప్రసాదం. దాన్ని నలుగురితో పంచుకుంటేనే దాని ప్రభావం రెట్టింపవుతుంది. పైగా.. ప్రసాదాన్ని పంచడం వల్ల మన పుణ్యం పెరుగుతుంది. బ్రహ్మోత్సవ నిర్వహణ వెనుక పరమార్థం కూడా.. దర్శనం, ప్రసాదం, దివ్యానందం అందరికీ కలిగించడమే. భక్తి విషయంలో అందరూ సమానమే అన్న పరమార్థాన్ని వివరిస్తుంది పవిత్ర దేవాలయం.


- మరింగంటి లక్ష్మణాచార్యులు, 9640233930

Updated Date - 2020-07-19T08:21:49+05:30 IST