బీజేపీ అధికారంలో ఉంటే ఎవరిపై దాడులు జరగవు: రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2021-03-16T22:51:16+05:30 IST

బీజేపీ అధికారంలో ఉంటే ఎవరిపై దాడులు జరగవు: రాజ్‌నాథ్

బీజేపీ అధికారంలో ఉంటే ఎవరిపై దాడులు జరగవు: రాజ్‌నాథ్

కోల్‌కతా: భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పశ్చిమ బెంగాల్‌లో ఎవరిపై దాడులు జరగవని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ దాడులు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయని, అందులో ఎక్కువగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైనే జరుగుతున్నాయని ఆయన అన్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలపై కూడా దాడులు జరగకుండా చూసుకుంటామని అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని మిద్నాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘నేను బెంగాల్ ప్రజలకు ఓ హామీ ఇస్తున్నాను. మేం అధికారంలోకి వస్తే ఎవరిపై దాడులు జరగనివ్వం. బీజేపీతో పాటు టీఎంసీ, సీపీఎం కార్యకర్తలపై కూడా దాడులు జరగకుండా చూసుకుంటాం. ఎవరిపై వివక్షతో వ్యవహరించం. ఎవరినైనా ఇలా వ్యవహరిస్తూ విధ్వంసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘పశ్చిమ బెంగాల్‌లో బాంబులు తయారవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. నేను విన్నది నిజమో కాదో.. కానీ, అలాంటి కార్యకలాపాలను అడ్డుకుంటాం. స్వాతంత్ర్యం అనంతరం రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి జరగలేదు. మేం అధికారంలోకి రాగానే బెంగాల్‌ను బంగారు రాష్ట్రంగా మారుస్తాం’’ అని అన్నారు.

Updated Date - 2021-03-16T22:51:16+05:30 IST