రేటు ఎంతయినా పర్లేదు... ఎన్ఎస్ఈ షేర్ల కోసం సంపన్నుల వేట...
ABN , First Publish Date - 2021-11-25T22:35:19+05:30 IST
ఎన్ఎస్ఈ షేర్ల కోసం సంపన్నులు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో... ఎంత ధరనైనా భరించేందుకు సిద్ధమవుతున్నారు. అన్లిస్టెడ్ స్పేస్లో ఎన్ఎస్ఈ మంచి జోరు మీదుంది
ముంబై : ఎన్ఎస్ఈ షేర్ల కోసం సంపన్నులు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో... ఎంత ధరనైనా భరించేందుకు సిద్ధమవుతున్నారు. అన్లిస్టెడ్ స్పేస్లో ఎన్ఎస్ఈ మంచి జోరు మీదుంది. ఈ కంపెనీ ఐపీఓ విషయం ఎటూతేలకుండా ఉండడంతో, సంస్థాగత పెట్టుబడిదారులు తమ వాటాల్లో కోత పెడుతున్నా, సంపన్న మదుపుదారులు మాత్రం షేర్ల వెంటపడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఈ ఎక్స్ఛేంజ్ అన్లిస్టెడ్ షేర్లు దాదాపు 7 % పెరిగాయి. అన్లిస్టెడ్ స్పేస్లో ఎన్ఎస్ఈ షేరు ప్రైస్ ఏడాది కాలంలోబాగా పెరిగిపోయింది. నిరుడు మార్చిలో ఒక్కొక్కటి రూ. వెయ్యి చొప్పున ట్రేడ్ కాగా, ఈ ఏడాది జనవరి నాటికి ఆ ధర రూ. 1,900కు చేరింది. అంతేకాదు... ఈ నెలలో కొన్ని లావాదేవీలు రూ. 3,500 వద్ద జరిగినట్లు కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు చెబుతున్నారు. తన ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ తరపున, ఎన్ఎస్ఈ అన్లిస్టెడ్ షేర్లను ఒక్కొక్కటి రూ. 3,275 చొప్పున సిటీ గ్రూప్... మొత్తం 2.2 మిలియన్ షేర్లను విక్రయించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్ఎస్ఈ లిస్టయితే కనీసం 50 % ప్రీమియం వస్తుందన్న నమ్మకంతో, పెట్టుబడిదారులు కూడా ఈ షేర్ల వెంట పడుతున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ కనీసం 2 లక్షల కోట్ల వాల్యుయేషన్పై దృష్టి పెట్టింది. ఈ ప్రకారం ఒక్కో షేరును రూ. 4,100 చొప్పున విక్రయించవచ్చని భావిస్తున్నారు. ఎన్ఎస్ఈ తన మొత్తం ఖర్చుల్లో 30 % కంటే ఎక్కువ మొత్తాన్ని సాంకేతికత కోసం వినియోగిస్తోంది. ఈ ప్రకారం చూస్తే... కేవలం స్టాక్ ఎక్స్ఛేంజ్గా మాత్రమే కాకుండా, ఫిన్టెక్ ప్లాట్ఫామ్ వాల్యుయేషన్ను కూడా ఈ కంపెనీ పొందుతుందని సర్ఫిన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెబుతోంది. కొత్త పెట్టుబడిదారులు భారీ సంఖ్యలో ఎన్ఎస్ఈ లో రిజిస్టర్ అవుతుండడంతో, కంపెనీ లాభదాయకత చాలా వేగంగా పెరుగుతోంది. పైగా, ఈ కంపెనీకి... వ్యాపారానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సీజన్ అంటూ లేదు. ఈ క్రమంలో... దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచిదని చెబుతున్నారు.