రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వొద్దు: విజయశాంతి
ABN , First Publish Date - 2021-03-08T08:21:24+05:30 IST
తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు కేంద్ర పథకాలు, నిధులు ఇవ్వవద్దని బీజేపీ నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు.
సైదాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు కేంద్ర పథకాలు, నిధులు ఇవ్వవద్దని బీజేపీ నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఆదివారం సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళానానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న కోట్లాది రూపాయల నిధులను రాష్ట్రంలో ఖర్చు చేస్తూ, ప్రధాని మోదీ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా సీఎం కేసీఆర్, కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. ప్రపంచంలోనే ఫాంహౌస్ నుంచి పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలుస్తారని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణను దివాళా తీయించిన టీఆర్ఎ్సను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం రావాలని, అది ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు.