Kakinada : TDP మేయర్‌పై అవిశ్వాసం.. వ్యతిరేకంగా 36 ఓట్లు.. కొత్త సారథి ఎవరో..!

ABN , First Publish Date - 2021-10-05T17:51:19+05:30 IST

గత ఇరవై రోజులుగా వ్యూహప్రతి వ్యూహాలతో రాజకీయ మలుపులు తిరిగిన కాకినాడ ..

Kakinada : TDP మేయర్‌పై అవిశ్వాసం.. వ్యతిరేకంగా 36 ఓట్లు.. కొత్త సారథి ఎవరో..!

కాకినాడ : గత ఇరవై రోజులుగా వ్యూహప్రతి వ్యూహాలతో రాజకీయ మలుపులు తిరిగిన కాకినాడ మేయర్‌ మార్పు ఘట్టానికి మంగళవారం 12 గంటలకు తెరపడింది. కాకినాడ నగర మేయర్‌ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మాన సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు జరిగింది. ఇందులో మేయర్‌కు వ్యతిరేకంగా 36 ఓట్లు వచ్చాయి. వాటిలో 21 మంది టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌కు వ్యతిరేకంగా ఓట్లు రావడం గమనార్హం. మరో 9 మంది టీడీపీ కార్పొరేటర్లు తటస్థంగా ఉండిపోయారు. దీంతో మేయర్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకున్నట్లయ్యింది.


డిప్యూటీ సంగతేంటో..!?

కాగా.. మరికాసేపట్లో డిప్యూటీ మేయర్‌ కాలా సత్తిబాబుపై అవిశ్వాస తీర్మాన సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ అధ్యక్షత వహించనున్నారు. నాలుగేళ్ల పదవీకాలం పూర్తయిన అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను మార్చేందుకు గత ప్రభుత్వంలో చట్టం చేయడంతో ఈ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మెజారిటీ కార్పొరేటర్లు గెలుపొందారు. దీంతో మేయర్‌, డిప్యూటీ  మేయర్‌ పదవులు టీడీపీకి దక్కాయి. తదనంతరం అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో కాకినాడలో రాజకీయ సమీకరణలు మారాయి.


ఎందుకిలా జరిగింది..!?

కాగా.. 2017లో జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 50 డివిజన్లకుగాను 48 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 32 టీడీపీ, 10 వైసీపీ, 03 బీజేపీ, 03 ఇండిపెండెంట్లు గెలుపొందారు. అప్పట్లో ఇండిపెండెంట్‌లు అందరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మేయర్‌ వ్యవహారశైలి నచ్చక కొందరు టీడీపీ కార్పొరేటర్లు విభేదించారు. ఈ పరిణామాలు తారస్థాయికి చేరి మొత్తం టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌కు దూరమయ్యారు. రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికల సమయంలో 21 మంది టీడీపీ కార్పొరేటర్లు తమను ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లుగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇదిలా ఉండగా టీడీపీలో గెలిచి ఆ పార్టీ ఓటమి పాలైన వెంటనే అధికార పార్టీతో చేతులు కలిపిన ఘటనలే.. మేయర్‌ను ఒంటరిని చేశాయనే కోణంలో చర్చ సాగింది.


మార్పుపై గురి..!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు కార్పొరేటర్లను తీసుకుని సిటీ ఎమ్మెల్యేను కలవడం అప్పట్లో దుమారం రేపింది. నాలుగేళ్లు పూర్తయిన తర్వాత పదవి నుంచి దించేస్తారనే ప్రచారం రెండేళ్ల కిందట నుంచే విస్తృతంగా ప్రచారం సాగింది. దీంతో పదవి కాపాడుకోవడం కోసం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మేయర్‌పై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లంతా ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి వర్గంగా ఏర్పడడంతో మేయర్‌ మార్పుపై గురిపెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ద్వారంపూడి ఆధ్వర్యంలోని టీడీపీ కార్పొరేటర్లు.. మేయర్‌, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస సమావేశం ఏర్పాటుచేయాలంటూ కలెక్టర్‌ను కోరడంతో అవిశ్వాస తీర్మాన సమావేశం పెట్టారు.


కొత్త మేయర్ ఎవరో..!?

కాగా.. కొత్త మేయర్ ఎవరనేది ప్రకటించొద్దని ఇప్పటికే హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కాకినాడ మేయర్‌పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేయి పైకెత్తి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీత ఓటు వేశారు. ఇదిలా ఉంటే.. అధిష్టానం విప్ జారీ చేసినప్పటికీ టీడీపీ కార్పొరేటర్లు ధిక్కరించి మరీ ఓటు వేయడం గమనార్హం. కార్పొరేటర్లు ఇలా చేయడం అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Updated Date - 2021-10-05T17:51:19+05:30 IST