సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వలేదో.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఎయిర్ ఇండియా పైలట్లు

ABN , First Publish Date - 2021-05-04T22:56:08+05:30 IST

విమాన సిబ్బందికి కరోనా టీకాలు ఇవ్వకుంటే సేవలు ఆపేస్తామని ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్ పైలట్లు ప్రభుత్వాన్ని

సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వలేదో.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఎయిర్ ఇండియా పైలట్లు

న్యూఢిల్లీ: విమాన సిబ్బందికి కరోనా టీకాలు ఇవ్వకుంటే సేవలు ఆపేస్తామని ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్ పైలట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎయిర్ ఇండియా సిబ్బంది కోసం జాతీయ స్థాయిలో ప్రథమ ప్రాథాన్యంగా కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించాలని ఎయిర్ ఇండియాను కోరారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్‌కు ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ) లేఖ రాసింది.


చాలామంది విమాన సిబ్బంది ఇప్పటికే కరోనా బారినపడ్డారని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి సమయంలో సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని పేర్కొంది. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారికి, డెస్క్‌లో ఉండి పనిచేస్తున్న వారికి వ్యాక్సిన్ వేస్తున్నారని, కానీ ఫ్లైయింగ్ సిబ్బందికి మాత్రం ఇప్పటి వరకు వేయలేదని ఆందోళన వ్యక్తం చేసింది.


విపత్కర పరిస్థితి వేళ దేశం వెంట ఉన్న విమాన సిబ్బందిని, వారి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటుందని తాము అనుకోవడం లేదని, అయితే మేనేజ్‌మెంట్ తీరు తమను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా జాతీయ స్థాయిలో వ్యాక్సినేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు ఇవ్వాలని, లేదంటే విధులు ఆపేస్తామని ఆ లేఖలో ఐసీపీఏ హెచ్చరించింది. 

Updated Date - 2021-05-04T22:56:08+05:30 IST