‘సుడా’ సుడితిరిగేదెన్నడు?.. సిబ్బంది నియామకంలో సర్కారు నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2020-08-14T19:18:18+05:30 IST
ఎనిమిది మండలాలు.. 45 పంచాయతీలు ఇవన్నీ ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో ఉన్నవే. స్థిరాస్తి వ్యాపారపరంగా దూసుకెళ్తున్నవే.
నగరపాలక సంస్థ అధికారులకు అదనపు బాధ్యతలు
అక్రమ వెంచర్లపై చర్యల్లో జాప్యం.. నోటీసులతోనే సరి
భారీగా ఆదాయం కోల్పోతున్న స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
ఖమ్మం (ఆంధ్రజ్యోతి): ఎనిమిది మండలాలు.. 45 పంచాయతీలు ఇవన్నీ ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో ఉన్నవే. స్థిరాస్తి వ్యాపారపరంగా దూసుకెళ్తున్నవే. మాయాజాలం, డబ్బు ప్రవాహం అధికంగా ఉండే రియల్ఎస్టేట్లో పారదర్శకత కోసం, ప్లాట్లు కొనుగోలు చేసే వినియోగదారుల ప్రయోజనం కోసం ప్రభుత్వం సుడా(స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అఽథారిటీని ఏర్పాటు చేసింది. దీనికో చైర్మన్, సభ్యులను నియమించిన ప్రభుత్వం, కీలకమైన అధికారుల నియామకంలో నిర్లక్ష్యం చూపుతోంది. నగరపాలక సంస్థ అఽధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారు అటూఇటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఇదే అదునుగా అక్రమ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. సిబ్బంది లేకపోవడంతో వాటిపై చర్యల్లో జాప్యం ఏర్పడుతోంది. ప్రభుత్వం కూడా ఆదాయాన్ని కోల్పోతోంది.
నోటీసులతోనే సరి
స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అఽథారిటీకి (సుడా) అధికారులను నియమించలేదు. నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపు కోవటంతో వారు పనిభారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారులు లేకపోవడంతో లే-అవుట్ అనుమతులు లేకుండా రియల్ఎస్టేట్ వ్యాపారులు వందల ఎకరాల్లో వెంచర్లు వేస్తున్నారు.. అధికారులు, సిబ్బంది నియామకం లేకపోవటంతో వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. కేవలం నామమాత్రంగా నోటీసులు పంపి ఊరుకుంటున్నారు. వాటిని పట్టిం చుకోని యజమానులు ఇష్టారీతిగా కొత్త వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు.
8మండలాలు, 45 పంచాయితీలు.
ఖమ్మం, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లోని 45 పంచాయతీలు సుడా పరిధిలోకి వ స్తాయి. ఆయా గ్రామాల్లో వెంచర్లు ఏర్పాటును సుడా అధికారులు పరిశీలించాలి. వివిధ రకాల అనుమతులు సుడా నుంచే రావాలి. దీనికోసం ప్రభుత్వం సుడాకు ప్రత్యేకంగా అధికారులను నియమించాల్సి ఉంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఈ భారం మొత్తం నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక అధికారులు పైన పడుతోంది. సుడాకు సంబంధించిన పనులతోనే వారి సమయమంతా గడిచిపోతుంది. అదనపు బాధ్యతలు ఉండటంతో నగరపాలక సంస్థ కా ర్యాలయానికి రాలేకపోతున్నారు. ఒకవైపు అక్రమ వెంచర్లు, లేఅవుట్లు క్రమబద్ధీకరించమంటూ(ఎల్ఆర్ఎస్) అధికారుల నుంచి ఒత్తిడి, మరోవైపు సుడా పనులు, దాని పరిధిలోని అక్రమ వెంచర్ల క్రమబద్ధీకరణ వంటి పనులతో సతమ తమవుతున్నారు. ఈ పనుల ఒత్తిడితో ఇద్దరు అధికారులు ఇటీవల అనారోగ్యం పాలయ్యారంటే పరిస్థితిని అర్ధం చేసు కోవచ్చు.
పట్టణ ప్రణాళిక అధికారులకే
సుడా బాధ్యతలు మొత్తం నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక అధికారులకే అప్పగించారు. సుడాకు ప్రత్యేక కా ర్యాలయం ఏర్పాటు చేసి, ఛైర్మన్తో సహా సలహాసంఘ సభ్యులను నియమంచినా, అధికారులను కేటాయించలేదు. అ దనపు బాధ్యతలు తీసుకున్న పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఇటు నగరపాలక సంస్థ కార్యాలయం, అటు సుడా కార్యాలయానికి చక్కర్లు కొట్టాల్సివస్తోంది. సుడా ముఖ్య ప్రణాళిక అధికారి బాధ్యతలను (సీపీవో) పట్టణ ప్రణాళిక రీజనల్ డైరెక్టర్ వరంగల్కు అప్పగించారు. ఆయన మరో మూడు జిల్లాలకు ఇన్ఛార్జ్ అధికారి. ఒక ప్రణాళికా అధికారి బాధ్యతలను నగరపాలక సంస్థలోని అసిస్టెంట్ సిటీ ప్లానర్కు అప్పగించారు. ఇక జూనియర్ ప్రణాళిక అదికారి బా ధ్యతలను బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకు అప్పగించారు. వీరు 45 పంచాయతీల్లో సుడాను పర్యవేక్షించాలి. సుడాకు అధికారుల నియామకం లేకుండా కేవలం ఇద్దరు, ముగ్గురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించటంతో వారు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రభుత్వం స్పందించి అధికారులను నియమిస్తే సుడాకు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.