కోవిడ్-19 వ్యాక్సిన్ దిగుమతి కోసం ఆర్డర్ ఇవ్వలేదు : పాకిస్థాన్

ABN , First Publish Date - 2021-01-16T22:36:49+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు తుది ఆర్డర్ ఇవ్వలేదని

కోవిడ్-19 వ్యాక్సిన్ దిగుమతి కోసం ఆర్డర్ ఇవ్వలేదు : పాకిస్థాన్

ఇస్లామాబాద్ : కోవిడ్-19 వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు తుది ఆర్డర్ ఇవ్వలేదని పాకిస్థాన్ ప్రకటించింది. ఇటీవల ఓ పత్రిక ప్రచురించిన కథనంలో చైనా నుంచి వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు ఉన్న ఏకైక నిబంధనను త్వరలోనే తొలగించబోతున్నట్లు పేర్కొనడంతో పాకిస్థాన్ ఈ వివరణ ఇచ్చింది. 


చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సినోఫార్మ్ కంపెనీ నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను పాకిస్థాన్ దిగుమతి చేసుకుంటోందని ఓ పత్రిక ఈ నెల 13న ప్రచురించింది. కరాచీలో ఈ వ్యాక్సిన్ ఫేజ్-1 ట్రయల్స్ తుది దశకు చేరుకున్నాయని తెలిపింది. ఈ వ్యాక్సిన్ దిగుమతిపై ఉన్న ఆంక్షలను త్వరలోనే తొలగిస్తారని కూడా పేర్కొంది. 


ఈ నేపథ్యంలో డాక్టర్ ఫైజల్ ఖాన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. డాక్టర్ ఫైజల్ ఆరోగ్య శాఖపై ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు స్పెషల్ అసిస్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కోవిడ్-19పై యుద్ధం చేస్తున్న పాకిస్థాన్‌లోని ఫ్రంట్‌లైన్ వారియర్స్, ఇతరుల కోసం వ్యాక్సిన్‌ను త్వరగా తీసుకురావాలని తాము ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే ఫైనల్ ఆర్డర్‌ను ఇంకా ఇవ్వలేదన్నారు. వ్యాక్సిన్ తయారీదారులతో కూడా ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పారు. 


చైనాకు చెందిన సినోఫార్మ్ కంపెనీ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్‌ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీకి సమర్పించిందని చెప్పారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదరలేదని చెప్పారు. కన్సినో వ్యాక్సిన్‌ గురించి కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. మరోవైపు రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ విపై కూడా ఆసక్తి చూపుతున్నామన్నారు. 




Updated Date - 2021-01-16T22:36:49+05:30 IST